విమాన ప్రయాణికులకు గుడ్న్యూస్: ఆ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అందుబాటులో
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు తీపి కబురు అందించింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మూసివేసిన టీ2 టెర్మినల్ను అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి ముహూర్తాన్ని ఖాయం చేసింది. కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. నాలుగైదు రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోన్నప్పటికీ.. జాతీయ స్థాయి గణాంకాలపై వాటి ప్రభావం తక్కువే. దేశవ్యాప్తంగా నమోదయ్యే కొత్ కేసులు ప్రస్తుతానికి పరిమితంగానే ఉంటోన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 38,079. 560 మంది మరణించారు. రికవరీ రేటు 97.31 శాతంగా నమోదైంది.
కరోనా తీవ్రత తగ్గుతుండటంతో విమానయాన కార్యకలాపాలు క్రమంగా మెరుగుపడుతోన్నాయి. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి అధికమౌతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఎయిర్పోర్ట్లోని టీ2 టెర్మినల్ను అందుబాటులోకి తీసుకుని రావాలని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ తెలిపింది. ఈ నెల 22వ తేదీన అర్ధరాత్రి 12 గంటల నుంచి టీ2 టెర్మినల్ సేవలను పునఃప్రారంభించనున్నట్లు పేర్కొంది.
తొలిరోజు 200 విమానాలు రాకపోకలు సాగించేలా షెడ్యూల్ను రూపొందించినట్లు స్పష్టం చేసింది. ఆగస్టు చివరినాటికి క్రమంగా ఈ సంఖ్యను 280కి పెంచుతామని వివరించింది. ఇండిగో విమానాలతో టీ2 టెర్మినల్ పునఃప్రారంభమౌతాయని తెలిపింది. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 2000-2999 సిరీస్ విమానాల కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే కొనసాగుతాయని ఐజీఐ ఎయిర్పోర్ట్ పేర్కొంది. రోజూ 25 వేలమంది ప్రయాణికులు ఈ టెర్మినల్ గుండా రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తోన్నామని పేర్కొంది.