KYC Update: రిజర్వుబ్యాంక్ గుడ్న్యూస్: ఒకదాని వెంట ఒకటి
ముంబై: కొత్త సంవత్సరం సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. డిసెంబర్ 31వ తేదీ నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం కూడా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో- కొన్ని డెడ్లైన్స్ కూడా ముగింపుకొచ్చేశాయి. ఇందులో కీలకమైనది.. కోట్లాదిమంది పన్ను చెల్లింపుదారులతో ముడిపడి ఉన్నదీ.. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలు గడువు. శుక్రవారంలోగా ఐటీ రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంది.
ఈ పరిస్థితుల్లో ఐటీఆర్ ఫైలింగ్స్కు సంబంధించిన పోర్టల్ ఒక్కసారిగా స్లో డౌన్ అయింది. సర్వర్ స్తంభించిపోయింది. ఐటీఆర్ ఫైలింగ్స్ అప్లోడ్ చేయలేకపోతోన్నారు పన్ను చెల్లింపుదారులు. తమ వివరాలను అప్లోడ్ చేసిన ప్రతీసారీ ఎర్రర్ అంటూ చూపిస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్స్కు గడువు సమీపిస్తోండటం, పోర్టల్ స్తంభించిపోతుండటంతో ట్యాక్స్ పేయర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తుది గడువును పొడిగించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.
దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్స్, డిమాండ్స్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ రిజర్వ్బ్యాంక్ కీలక ప్రకటన విడుదల చేసింది. కేవైసీ అప్డేట్ గడువును పొడిగించింది. నిజానికి- దీని గడువు కూడా శుక్రవారం నాటితో ముగియాల్సి ఉంది. ఒక్కరోజు ముందు రిజర్వ్బ్యాంక్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. కేవైసీ గడువును డిసెంబర్ 31వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది.
ఈ మేరకు ఓ సర్కులర్ను జారీ చేసింది. బ్యాంకు ఖాతాదారులు తమ కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందనేది రిజర్వుబ్యాంక్ నిబంధన. డిసెంబర్ 31వ తేదీ వరకు అప్డేట్కు అవకాశం ఇస్తున్నట్లు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వుబ్యాంక్ మే 5వ తేదీన ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఈ గడువు ముగింపుదశకు వచ్చింది. శుక్రవారం నాటితో కేవైసీని అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి చేసింది.
తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోన్నందున ఈ డెడ్లైన్ను 2022 మార్చి 31కి పొడిగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేంత వరకూ గడువు ఇచ్చింది. ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్) రూల్స్ 2005కి అనుగుణంగా కేవైసీని అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి.