AP GIS-2023: ముగిసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023.. ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ముగిసింది. జీఐఎస్ విజయానికి కృషి చేసిన అందరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. కీలక సమయంలో సమ్మిట్ నిర్వహించామన్నారు. ఏపీని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతున్నామని జగన్ స్పష్టం చేశారు. 15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్యలు జరిగాయని ఆయన వివరించారు. కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయన్నారు. గ్రీన్ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని జగన్ చెప్పారు.
రూ.13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులు
ఈ సదస్సుతో ఏపీలోకి పెట్టుబడులు భారీగా వచ్చాయి. ఈ రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు రూ.13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 352 ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రానికి 13 లక్షల 5వేల 663 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
6,03,223 మందికి ఉపాధి
ఈ పెట్టుబడుల ద్వారా 6,03,223 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. ఎనర్జీ విభాగంలో రూ.9 లక్షల 7వేల 126 కోట్ల పెట్టుబడులు రాగా.. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ.3లక్షల 35వేల 644 కోట్లు, ఐటీ అండ్ ఐటీఈఎస్ విభాగంలో రూ.39వేల 636 కోట్లు, పర్యాటక విభాగంలో రూ.22వేల 96కోట్లు, వ్యవసాయ విభాగంలో రూ.1,160 కోట్లు, పశుసంవర్ధక విభాగంలో రూ.1,020 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
కిషన్ రెడ్డి
ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి చెప్పారు. జీఐఎస్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేశంలో అంతర్జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని... ప్రపంచ ఆర్థికప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్ ప్రకటించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.