LIC IPO : అతిపెద్ద ఈ ఐపీవోతో ప్రయోజనం ఏమిటంటే? మరిన్ని తెలుసుకోండి..
ప్రభుత్వరంగ లైఫ్ ఇన్సురెన్స్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మొదటి పబ్లిక్ ఆఫర్ (IPO) యత్నాలను ఆర్థిక శాఖ కొనసాగిస్తోంది. ఇందుకు సంబంధించి సలహా సంస్థను ఎంపిక చేసేందుకు కన్సల్టింగ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్-మర్చంట్ బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుండి బిడ్స్ను శుక్రవారం ఆర్థిక శాఖ ఆహ్వానించింది. ఐపీవో ముందు కార్యాచరణ నిర్వహించేందుకు, పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ సంస్థ (దీపమ్)కు సంహకరించేందుకు రెండు సలహా సంస్థలను ఎంపిక చేయనున్నారు.
డిస్కౌంట్ తగ్గింది! రికార్డ్ దిశగా.. భారీగా పెరగనున్న బంగారం ధర
ఐపీవోకి సలహాదారు ఎంపికకు జూలై 13 వరకు బిడ్స్
జూలై 13వ తేదీ వరకు బిడ్స్ సమర్పించే వీలు ఉంది. 2017 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2020 మార్చి 31వ తేదీలోపు కనీసం రూ.5000 కోట్ల ఐపీవోకు సలహాదారుగా పని చేసిన అనుభవం లేదా రూ.1500 కోట్ల క్యాపిటల్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించిన సామర్థ్యం ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 13వ తేదీన వేసిన బిడ్స్ జూలై 14వ తేదీన బిడ్స్ పరిశీలన ప్రారంభమవుతుంది.
రూ.2.10 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యం
ఎల్ఐసీ ఐపీవో దేశంలోనే అతిపెద్దది కానుంది. దీని కోసం రెండు సలహా సంస్థలను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్/మర్చంట్ బ్యాంకర్స్/ఆర్థిక సంస్థలు/బ్యాంకుల నుంచి దరఖాస్తుల్ని దీపమ్(డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్మెంట్ మేనేజ్మెంట్) ఆహ్వానించింది. ఎల్ఐసీ ఐపీఓ ఈ ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్లో ఉండవచ్చునని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ. 2.10 లక్షల కోట్లు సమీకరించాలనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇన్సురెన్స్ మార్కెట్లో ఎల్ఐసీ పరిమాణం
ఐపీవో ద్వారా 5 శాతం నుండి 10 శాతం వరకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ఐసీని 1956లో ఏర్పాటు చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఎల్ఐసీ ఆస్తులు ఆల్ టైమ్ హై రూ.31.11 లక్షల కోట్లు. 2018-19లో ఈక్విటీ పెట్టుబడుల నుండి రూ.23,621 వచ్చాయి. అంతకుముందు ఏడాది ఈక్విటీ ద్వారా రూ.25,646 కోట్లు వచ్చాయి. అంటే తదుపరి సంవత్సరం ఈక్విటీ ఆదాయం 7.89 శాతం తగ్గింది.
మార్కెట్లో ఎల్ఐసీ వాటా
2018-19లో మొదటి సంవత్సరం ప్రీమియంలో ఎల్ఐసీ వాటా 66.24 శాతం ఉంది. కొత్త పాలసీల్లో 74.71 శాతం ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీవో, ఐడీబీఐ వాటా అమ్మకం ద్వారా రూ.90,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. మరో రూ.1.2 లక్,ల కోట్లను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలని నిర్ణయించింది.
ఎల్ఐసీ ఐపీవో.. పారదర్శకత
ఎల్ఐసీ ఐపీవో ద్వారా ఓ ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. పారదర్శకత వస్తుందని అంటున్నారు. ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజీలకు ఆర్థిక సంఖ్యలు కచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇతర మార్కెట్ సంబంధ పరిణామాలను తెలియజేయాల్సి ఉంటుంది. బీమా సంస్థలో ఈక్విటీని పొందటం ద్వారా ఇన్వెస్టర్లు లాభపడతారు.