కేంద్రానికి ఎలాన్ మస్క్ అల్టిమేటం: భారత్లో టెస్లాపై కార్ల తయారీపై తుదినిర్ణయం
ముంబై: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్- కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. భారత్లో టెస్లా తయారీ ప్లాంట్ను నెలకొల్పే విషయంలో తన తుదినిర్ణయాన్ని వెల్లడించారు. టెస్లా కార్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పే విషయంలో ఎలాన్ మస్క్- కేంద్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్ఠంభన, చిక్కుముడి మరింత బిగిసేలా ఆయన నుంచి తాజా ప్రకటన వెలువడింది.
భారత్లో టెస్లా కార్ల విక్రయం, తయారీ యూనట్లను నెలకొల్పే విషయంలో ఎలాన్ మస్క్ తన పట్టుదలను వీడట్లేదు. భారత్లో టెస్లాకార్ల తయారీ యూనిట్లను నెలకొల్పాలనే ఆలోచన ఇప్పట్లో చేయట్లేదని ఆయన తాజాగా స్పష్టం చేశారు. భారత్కు చెందిన కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఎలాన్ మస్క్ సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో తన నిర్ణయం కూడా మారబోదని తేల్చి చెప్పారు. తాను చేసిన కొన్ని ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించాల్సి ఉందని వివరించారు.
అవి నెరవేరేంత వరకూ భారత్లో టెస్లా కార్ల తయారీ యూనిట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నెలకొల్పబోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. టెస్లా కార్ల అమ్మకాలు, సర్విసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొదట అనుమతి ఇవ్వాల్సి ఉందని ఎలాన్ మస్క్ వివరించారు. దీనిపై తాను ఇదివరకే కొన్ని ప్రతిపాదనలను పంపించానని వివరించారు. భారత్ను కేంద్ర బిందువుగా చేసుకుని ఆసియా దేశాల్లో తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాలని భావించానని, పరిస్థితులు దీనికి అనుకూలంగా లేవని ఇదివరకే అన్నారు.
We are waiting for government approval
— Elon Musk (@elonmusk) May 27, 2022
ఆ ప్రకటనకే ఎలాన్ మస్క్ కట్టుబడి ఉన్నాడనేది తాజా ప్రకటనతో స్పష్టమైంది. భారత ప్రభుత్వం తమ కార్ల అమ్మకాలు, సర్వీసింగ్ సెంటర్లను నెలకొల్పడానికి అనుమతి ఇవ్వాల్సి ఉందని అన్నారు. ఈ అనుమతి లభించేంత వరకూ తాను భారత్లో తయారీ యూనిట్లను నెలకొల్పబోనని భీష్మించారు. భారత్లో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ విషయం ఏమైంది?, భవిష్యత్లో ఇక్కడ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటవుతుందా? అంటూ మధుసూదన్ వీ అనే ట్విట్టరెటీ అడిగిన ప్రశ్నకు ఎలాన్ మస్క్ బదులిచ్చారు.
Tesla will not put a manufacturing plant in any location where we are not allowed first to sell & service cars
— Elon Musk (@elonmusk) May 27, 2022
స్పేస్ఎక్స్ ఆధ్వర్యంలో అమెరికా సహా పలు దేశాలు సేవలందిస్తున్న స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీసులు భారత్లో అందుబాటులోకి తీసుకుని రావడంపైనా ఎలాన్ మస్క్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించాల్సి ఉందని స్పష్టం చేశారు. తక్కువ వ్యయంతో స్టార్ లింక్ అద్భుతమైన ఇంటర్నెట్ సేవలను అందిస్తోందని, భారత్లో దీన్ని విస్తరించడానికి అవకాశం ఉందా అంటూ ప్రణయ్ పాఠోలె అనే ట్విట్టరెటీ అడిగిన ప్రశ్నకు మస్క్ సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అంగీకరించాల్సి ఉందని వివరించారు.