భారత్లోకి టెస్లా రాక! టెస్లాకు రాయితీలకు ఓకే కానీ: కేంద్రం ఆఫర్
ఇటీవల ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కార్లు భారత్లో చర్చనీయంశంగా మారిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వంతో సవాళ్లున్నాయని, అందుకే టెస్లా భారత్ ఎంట్రీ ఆలస్యమవుతోందని ఎలాన్ మస్క్ ఇటీవల ఓ నెటిజన్కు సమాధానం చెప్పారు. దీంతో తెలంగాణ, పంజాబ్ సహా వివిధ రాష్ట్రాలు ఎలాన్ మస్క్ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. భారత ప్రభుత్వం టెస్లాకు పన్ను మినహాయింపుకు సిద్ధంగా ఉంది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదా విడిభాగాల యూనిట్ ఇక్కడ ఉండాలని చెబుతోంది. కానీ టెస్లా మాత్రం మొత్తం కారును చైనా నుండి దిగుమతి చేయాలని చూస్తోంది. దీనికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇక్కడ యూనిట్ ఏర్పాటుకు టెస్లా సిద్ధంగా లేదు. ఎలాన్ ట్వీట్ను పొరపాటుగా అర్థం చేసుకున్న రాష్ట్రాలు యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. తాజాగా కేంద్రం మస్క్కు మరో ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది.
టెస్లాకు కేంద్రం ఆఫర్
టెస్లా విద్యుత్ కార్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. భారత్లోకి ఎంట్రీ కోసం ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంశంతో పాటు ఎలాన్ మస్క్ ప్రత్యేక రాయితీలు కోరుతున్నారు. అయితే ఇతర కంపెనీలకు ఇవ్వని రాయితీలు టెస్లాకు మాత్రమే సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఎలాన్ మస్క్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం... టెస్లా ముందు ఓ ఆఫర్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
పన్నులు.. తయారీ
భారత్లో ఈవీ వాహనాల దిగుమతిపై ట్యాక్స్ అధికంగా ఉందని టెస్లా గతంలో ఆరోపించింది. ప్రపంచలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ట్యాక్స్ ఉందని తెలిపింది. దీనిని తగ్గించాలని కోరింది. ట్యాక్స్ తగ్గింపుతో పాటు ప్రారంభంలో దిగుమతి చేసిన కార్లను విక్రయిస్తామని, ఆ తర్వాత తయారీ యూనిట్ను నెలకొల్పుతామని టెస్లా తెలిపింది. అదే సమయంలో టెస్లా కార్లు, బ్యాటరీల కోసం భారత్ నుండి సేకరిస్తున్న ముడిపదార్థాల కొనుగోళ్లను భారీగా పెంచుతామని ఆఫర్ ఇచ్చారు. దీనిపై అప్పట్లో కేంద్రం స్పందిస్తూ, ఇతర ఏ కంపెనీలకు ఇవ్వని ప్రయోజనాలను టెస్లాకు కల్పిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిపింది. అందుకే తయారీని భారత్లో ప్రారంభించాలని, తర్వాత రాయితీ గురించి ఆలోచిస్తామని తెలిపింది.
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్
మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్లో తప్పనిసరిగా మ్యానుఫ్యాక్చరింగా యూనిట్ను ఏర్పాటు చేయాలని కేంద్రం చెబుతోంది. పన్ను ప్రయోజనాలను కల్పించే ముందు భారత్లో పెట్టుబడుల ప్రణాళికలపై స్పష్టతను కోరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర బడ్జెట్ పైన టెస్లా ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. 40,000 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యాల్యూతో భారత్లో దిగుమతి సుంకాల విషయానికి వస్తే విద్యుత్ వాహనాలపై ప్రభుత్వం 60 శాతం పన్ను విధిస్తోంది. 40,000 డాలర్ల కంటే తక్కువ ఉంటే 100 శాతం ఉంది.