నెదర్లాండ్స్ మీదుగా భారత్లోకి టెస్లా: ఎలాన్ మస్క్ 'ట్యాక్స్' ప్లాన్
టెస్లా ఇండియా భారత్లో అడుగుపెట్టింది. అయితే నేరుగా మన దేశానికి రావడం లేదు. భారత్లో తన వ్యాపారానికి అవసరమైన పెట్టుబడులు ఎక్కడి నుండి వస్తే లాభమో చూసుకొని, నెదర్లాండ్స్ను ఎంచుకున్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఇటీవల భారత్లో ఎలాన్ మస్క్ రిజిస్టర్ చేసిన టెస్లా మోటార్స్ అండ్ ఎనర్జీ ఇండియాకు నెదర్లాండ్స్లోని టెస్లా మోటార్స్ నెదర్లాండ్స్ మాతృసంస్థగా వ్యవహరిస్తుంది.
ఇండియాలోకి ఎంట్రీపై ఎలాన్ మస్క్, టెస్లా కారు-బెంగళూరు రోడ్లపై మీమ్స్
మస్క్కు లాభాలు
మస్క్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎలాన్ మస్క్కు భారత్లో మూలధనంపై వచ్చే లాభాలు, డివిడెండ్ చెల్లింపుల్లో భారీగా పన్ను రాయితీలు లభిస్తాయి. నెదర్లాండ్ ఎంచుకోవడానికి పలు ప్రధాన కారణాలు ఉన్నాయి. టెస్లా ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో రిజిస్టర్ అయింది. టెస్లా మోటార్స్ నెదర్లాండ్స్ దీని అనుబంధ సంస్థ. అమెరికా సంస్థలు నెదర్లాండ్స్ను ఎక్కువగా ఇష్టపడతాయి. కంపెనీలకు పన్ను రాయితీలు, మేథోహక్కుల సంరక్షణ చట్టాలు ఉన్నాయి.
చట్టాల సవరణ తర్వాత
గతంలో సింగపూర్, మారిషస్ నుండి FDIలు వచ్చేవి. కానీ ఈ రెండు దేశాల పన్ను ఒప్పందాలను భారత్ సవరించింది. సవరణ తర్వాత ఈ దేశాల నుండి వచ్చే పెట్టుబడులపై మూలధన పన్ను రాయితీలు తగ్గాయి. ఇలా పన్ను రాయితీల కోసం నెదర్లాండ్స్ కూడా ఒకటి. నెదర్లాండ్స్తో ఉన్న ఒప్పందం ప్రకారం ఆయా డచ్ కంపెనీలు భారతీయ విభాగాల్ని విదేశీ కంపెనీలకు విక్రయించినా మూలధన పన్ను మినహాయింపు ఉంటుంది. డివిడెండ్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా తక్కువ. అందుకే మస్క్ దీనిని ఎంచుకున్నారు.
మరిన్ని రాష్ట్రాల్లో
జనవరి 8న బెంగళూరులోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో టెస్లా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ అయింది. రూ.1లక్ష పెయిడప్ క్యాపిటల్తో అన్లిస్టెడ్ సంస్థగా ఓ కంపెనీ నమోదు చేసుకుంది.
ఆధీకృత మూలధనం రూ.15లక్షలుగా పేర్కొంది. మరిన్ని రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు టెస్లా సిద్ధమవుతోంది.