ట్విట్టర్ను కొనేట్టులేడుగా: ఎలాన్ మస్క్ కొత్త ట్విస్ట్: ఫేక్ అకౌంట్స్పై పోలింగ్
వాషింగ్టన్: టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి వెళ్లినట్టే వెళ్లిన ఈ బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కొనుగోలు ప్రక్రియలో అనుకోని అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. కొనుగోలు ప్రక్రియను ముందుకు సాగనివ్వకుండా ఎక్కడికక్కడ బ్రేకులు పడుతున్నాయి.
అపర కుబేరుడు ఎలాన్ మస్క్- 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఆ కంపెనీ కూడా అంగీకరించింది. మస్క్ తమ ముందు ఉంచిన ప్యాకేజీకి ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేశారు. మూడు నెలల్లో కంపెనీ బదలాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జేపీ మోర్గాన్ వంటి టాప్ ప్లేయర్స్- యాజమాన్య బదలాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తోన్నాయి.
ఈ ప్రక్రియ వేగవంతమైన ప్రస్తుత పరిస్థితుల మధ్య ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇది తాత్కాలికమేనని అప్పట్లో ఆయన స్పష్టం చేసినప్పటికీ- కొన్ని అనుమానాలు తాజాగా తలెత్తుతున్నాయి. ట్విట్టర్ యాజమాన్యం సూచించిన స్పామ్ లేదా ఫేక్ అకౌంట్స్ లెక్కలపై అనుమానాలు వ్యక్తం కావడం వల్లే ఈ డీల్ను ఎలాన్ మస్క్ తాత్కాలికంగా నిలిపి వేశారు.
ఇప్పుడిదే పాయింట్తో మొత్తం టేకోవర్ ప్రాసెస్ను పూర్తిగా నిలిపివేయాలనే భావనలో ఎలాన్ మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం అకౌంట్లల్లో అయిదు శాతం కంటే తక్కువగా నకిలీ యూజర్లు ఉన్నట్లు ఇదివరకు ట్విట్టర్ మేనేజ్మెంట్ తెలియజేయగా.. దీనిపై ఎలాన్ మస్క్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ట్విట్టర్ యూజర్ల నుంచి అభిప్రాయాన్ని సేకరించే పనిలో పడ్డారు. తాజాగా- తన అధికారిక ట్విట్టర్ అకౌంట్పై ఓ పోల్ను కండక్ట్ చేస్తున్నారాయన.
Twitter claims that >95% of daily active users are real, unique humans. Does anyone have that experience?
— Elon Musk (@elonmusk) May 17, 2022
తమ రోజువారీ అకౌంట్స్ వినియోగదారుల్లో 95 శాతం మంది యాక్టివ్గా ఉన్నారని ట్విట్టర్ యాజమాన్యం తెలిపిందని, ఇది నిజమేనా? అనే ప్రశ్నతో ఆయన ఈ పోల్ను నిర్వహిస్తోన్నారు. ఈ పోల్ను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 13,66,258 మంది ఓటు వేశారు. తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. 24 గంటల పాటు ఉండే పోల్ క్వశ్చన్ ఇది. ఇంకా తొమ్మిది గంటల సమయం మిగిలివుంది. కనీసం 30 లక్షల మంది ఈ ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.