ఫేస్బుక్, వాట్సాప్ ఎఫెక్ట్: టెలిగ్రామ్కు 50 మిలియన్ల కొత్త యూజర్లు
ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ సేవల్లో నిన్న అంతరాయం ఏర్పడింది. ఫేస్బుక్తో పాటు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలూ స్తంభించాయి. దీంతో కస్టమర్లు కొద్ది గంటలపాటు ఇబ్బందులు పడ్డారు. ఆరు గంటలకు పైగా అంతరాయం ఏర్పడిన అనంతరం, మంగళవారం వేకువజామున 4 గంటల నుండి వాట్సాప్ సేవలను పునరుద్ధరించారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవల అంతరాయంపై అధినేత మార్క్ జుకర్బర్గ్ క్షమాపణ చెప్పారు.
'అంతరాయానికి చింతిస్తున్నామ'ని మార్క్ పేర్కొన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ ఆన్లైన్లో ఇప్పుడు పునరుద్ధరించామని కూడా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. అయితే ఫేస్బుక్, వాట్సాప్లో అంతరాయం ఏర్పడిన సమయంలో ప్రత్యామ్నాయ టెలిగ్రామ్, సిగ్నల్ వినియోగం భారీగా పెరిగింది.
తీవ్ర అంతరాయం
ఆరు గంటలకు పైగా ఫేస్బుక్ సేవలకు అంతరాయం కలగడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. డొమైన్ నేమ్ సిస్టమ్(DNS) సమస్య వల్ల బఫరింగ్ స్లో కావడం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రిఫ్రెష్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. వాట్సాప్ అయితే పూర్తిగా పని చేయకుండా నిలిచిపోయింది.
చివరికి ఫేస్బుక్ వర్చువల్ రియాల్టీ డివిజన్ ఒక్యూలస్ కూడా నిలిచిపోయి ఫేస్బుక్ను మరింత దెబ్బతీసింది. దీంతో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ డౌన్, ఫేస్బుక్ డౌన్, వాట్సాప్ డౌన్ అంటూ హ్యాష్ట్యాగ్స్ పెట్టారు. నేడు ఉదయం సమస్య పరిష్కారమైంది. అయితే సమస్య తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయ సోషల్ అనుసంధాన వేదిక వైపు చూశారు నెటిజన్లు.
50 మిలియన్ల కొత్త యూజర్లు
వాట్సాప్ అంతరాయం నేపథ్యంలో యూజర్లు ప్రత్యామ్నాయం బాట పట్టారు. యూట్యూబ్, ఇతర సైటల్లో ఎక్కువసేపు గడిపారు. అదే సమయంలో ఇన్స్టంట్ మెసేజింగ్ సర్వీస్ల కోసం టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్స్ను వినియోగించారు. ముఖ్యంగా టెలిగ్రామ్ మెసేంజర్ యాప్ ఫేస్బుక్ సేవల విఘాతం వల్ల భారీగా లాభపడింది.
కొత్తగా కోట్లాదిమంది కొత్త యూజర్లు టెలిగ్రామ్కు సైన్-అప్ అయ్యారు. చాలామంది సైన్-ఇన్ ద్వారా ఉపయోగించుకున్నారు. టెలిగ్రామ్కు ఒక్కసారిగా యూజర్లు పెరగడంతో సర్వీసులు కాస్త నెమ్మదించాయి. దీంతో రిపోర్ట్స్ వచ్చాయి. ఫేస్బుక్, వాట్సాప్ క్రాష్ తర్వాత టెలిగ్రామ్ యాప్ 50 మిలియన్ల కొత్త యూజర్లను నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఈ మేరకు జత కలిసినట్లుగా చెబుతున్నారు.
అందుకే సంపద క్షీణించింది
సోమవారం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ స్తంభించిపోవడంతో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ సంపద కొన్ని గంటల వ్యవధిలో 6 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయారు. అంటే మన కరెన్సీలో రూ.50వేలకోట్లకు పైగా. దీంతో బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో మూడో స్థానం నుండి అయిదో స్థానానికి పడిపోయారు.
ప్రస్తుతం ఆయన సంపద 122 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫేస్బుక్ ఇష్యూ నేపథ్యంలో సంస్థ షేర్లు ఐదు శాతం మేర పడిపోయాయి. దీంతో గతనెల మధ్య నుండి ఇప్పటి వరకు కంపెనీ షేర్ల విలువలో 15 శాతం తగ్గుదల నమోదయింది. అలాగే నిన్న అనేక కంపెనీలు ఫేస్బుక్ నుండి తమ ప్రకటనలను తొలగించాయి. ఈ నేపథ్యంలోనే జుకర్బర్గ్ సంపద క్షీణించింది.