మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్, ఏప్రిల్ నుండి టారిఫ్ పెంపు?
న్యూఢిల్లీ: మరికొద్దిరోజుల్లో ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ ధరలు పెరగనున్నాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. 2016లో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ నుండి జియో రాకతో టారిఫ్ భారీగా పడిపోయింది. టెలికం కంపెనీల మధ్య పోటీ పెరిగి డేటా ధరలు, ఫోన్ కాల్స్ ధరలు తగ్గాయి. అయితే ఇటీవల టెల్కోలు ప్రస్తుత ఆర్పు లేదా ఆదాయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ధరలు పెరగాల్సి ఉందని ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్రతినిధులు చెబుతున్నారు.
ఏప్రిల్ నుండి పెరుగుదల
జియో రాక నేపథ్యంలో టెలికం కంపెనీల మధ్య పోటీ పెరిగింది. దీంతో డేటా ధరలతో పాటు ఫోన్ కాల్స్ ధరలు కూడా తగ్గాయి. అయితే వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుండి డేటా, కాల్స్ ధరలు పెంచేందుకు టెల్కోలు సిద్ధమయ్యాయని తెలుస్తోంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ సంస్థ ICRA ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి ధరలు పెరిగే అవకాశముంది. టారిఫ్ పెంపు ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తాయి. అయితే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి ఎంత మేర పెరుగుతాయనేది తెలియాల్సి ఉంది.
4Gకి మార్చడంతో పాటు
ప్రస్తుతమున్న 2G కస్టమర్లను 4Gకి మార్చడంతో పాటు ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ ధరలు పెంచడం ద్వారా ARPU (సగటు వినియోగదారు వెచ్చించే ఆదాయం) పెంచుకోవాలని కంపెనీలు చూస్తున్నట్లు ఇక్రా అభిప్రాయపడింది. దీంతో టెల్కోల ఆదాయం రాబోయే రెండేళ్లలో 11 శాతం నుండి 13 శాతంకు పెరిగే అవకాశముంది. టెలికాం పరిశ్రమపై కరోనా పెద్దగా ప్రభావం చూపలేదు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్లు వంటి వాటి కారణంగా ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ వినియోగం పెరిగింది. ఈ కారణంగా ప్రభావం పడలేదు.
రుణాలు
టెల్కోలు చివరిసారి 2019 డిసెంబర్ నెలలో టారిఫ్ రేట్లు పెంచాయి. మార్చి 31, 2022 నాటికి టెలికం పరిశ్రమ రుణాలు రూ.4.7 లక్షల కోట్లకు చేరుకుంటాయని ఇక్రా అంచనా వేసింది. కరోనా కాలంలో డేటా వినియోగం, కాల్స్ వినియోగం పెరిగింది.