AGR ఎఫెక్ట్: మొబైల్ కస్టమర్లకు షాక్, భారీగా పెరగనున్న టారిఫ్!
సర్దుబాటుచేసిన స్థూల ఆదాయం(AGR)కు సంబంధించిన బకాయిల చెల్లింపు పైన టెల్కోలకు మంగళవారం సుప్రీం కోర్టులో కొంత ఊరట లభించింది. ఏజీఆర్ బకాయిలు రూ.93,520 కోట్ల చెల్లింపుకు 20 ఏళ్ల సమయం ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నో చెప్పింది. 10 ఏళ్ళలో చెల్లించాలని స్పష్టం చేసింది. మార్చి 31, 2021 నాటికి పది శాతం బకాయిలు చెల్లించాలని పేర్కొంది.
ఏప్రిల్ 1, 2021 నుండి మార్చి 31, 2031 మధ్య వార్షిక వాయిదాల్లో మొత్తం చెల్లించాలని తెలిపింది. దీనికి సంబంధించి టెల్కోల ఎండీలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్లు నాలుగు వారాల్లో హామీ ఇవ్వాలి. సుప్రీం కోర్టు తీర్పు టెల్కోలకు ఇబ్బందికరంతో పాటు టారిఫ్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
10 ఏళ్లలో చెల్లించాలి: AGR బకాయిలపై ఎయిర్టెల్కు ఊరట, వొడాఫోన్ ఐడియాకు భారమేనా?
10 ఏళ్లలో కట్టగలవా..
ఎయిర్టెల్ రూ.43,989 కోట్లు చెల్లించాల్సి ఉండగా కొన్ని బకాయిలు చెల్లించడంతో రూ.25,976 కోట్లు చెల్లించాలి. వొడాఫోన్ ఐడియా రూ.58,254 కోట్లకు గాను కొన్ని చెల్లింపులు చేయగా రూ.50,399 కోట్లు చెల్లించాలి. టాటా టెలీ సర్వీసెస్ రూ.16,798 కోట్లు, ఆర్.కామ్. రూ.25,199 కోట్లు, ఎయిర్సెల్ రూ.12,289 కోట్లు, వీడియోకాన్ రూ.1,376 కోట్లు చెల్లించాలి. 10 సంవత్సరాల్లో ఈ మొత్తం చెల్లించడం ఎయిర్టెల్కు ఇబ్బందికరమేమీ కాదని, కానీ వొడాఫోన్ ఐడియాకు మాత్రం కష్టమేనని అంటున్నారు. 8 శాతం వడ్డీ చొప్పున ఎయిర్టెల్ రూ.3900 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.7500 కోట్లు కట్టవలసి ఉంది. సున్నా వడ్డీ అయితే వరుసగా రూ.2600 కోట్లు, రూ.5000 కోట్లు తగ్గుతుంది.
మొబైల్ కస్టమర్లకు భారం.. 10 శాతం టారిఫ్
ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ యూజర్లపై టారిఫ్ బారం 10 శాతం వరకు పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సున్నా వడ్డీతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వరుసగా రూ.2600 కోట్లు, రూ.5000 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితుల్లో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ARPU) వరుసగా 10 శాతం, 27 శాతం అవసరమని అంటున్నారు. ఈ కంపెనీల ఆర్పు క్రితం క్వార్టర్లో వరుసగా 157, 114గా ఉంది. ఈ పరిస్థితుల్లో మరో 10 శాతం టారిఫ్ పెరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
టారిఫ్ భారీగా పెరగొచ్చు
స్పెక్ట్రం ఖర్చులు, ఇతర పెట్టుబడులు పక్కన పెడితే, డేటా వాడకం పెంపుకు అవసరమైన మూలధన ఖర్చు కోసం సర్వీస్ ప్రొవైడర్లకు సమీప భవిష్యత్తులో ఆర్పు కనీసం 3 డాలర్ల నుండి 4 డాలర్లకు పెరగాల్సి ఉందని, ఈ పరిస్థితుల్లో రానున్న త్రైమాసికంలో టారిఫ్ పెంపు భారీగా ఉండవచ్చునని ఎంటర్ప్రెన్యూయర్ అండ్ టీఎంటీ అడ్వైజర్ సంజయ్ కపూర్ అన్నారు. టెలికం టారిఫ్ పెంపు అనివార్యంగా మారిందని టెలికం ఎక్స్పర్ట్ సంజయ్ కపూర్ అన్నారు.
ఆర్పు రూ.200కు
జియో ఎంట్రీ తర్వాత నాలుగేళ్ల పాటు ఆపరేటర్లు టారిఫ్ పెంచలేదు. 2019 డిసెంబర్ నెలలో 40 శాతం వరకు ఛార్జీలు పెరిగాయి. దీంతో 2020 తొలి అర్ధ సంవత్సరంలో 20 శాతం ఆదాయం పెరిగింది. టెలికం కంపెనీలు నిలబడాలంటే ఆర్పు రూ.300కు పైగా ఉండాలని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. అయితే రాబోయే 12-24 నెలల్లో కనీసం రూ.200కు పెరగాల్సి ఉందని అనాలిసిస్ మాసన్కు చెందిన మిడిల్ ఈస్ట్, ఇండియా హెడ్ రోహన్ ధమిజా అన్నారు.