పెరిగిన టారిఫ్లు.. మరి ఇప్పుడైనా టెలికాం షేర్లు కొనవచ్చా?
'టారిఫ్ వార్'తో నష్టాల్లో పడి కొట్టుమిట్టాడిన టెలికాం కంపెనీలు ప్రస్తుతం కొంత మేర కోలుకుంటున్నాయి. అన్ని నెట్వర్క్ ప్రొవైడర్లూ కాల్, డేటా టారిఫ్ పెంచడంతో ఆదాయం కూడా కొంతమేర పెరిగినట్లు. టారిఫ్ పెంపుతో టెలికాం రంగం తిరిగి నిలదొక్కుకున్నట్లే అనే సంకేతాలు వెలువడుతున్నాయి.
దీనికి తగ్గట్లే.. టారిఫ్ పెంపు అనంతరం టెలికాం షేర్లు పైపైకి ఎగిశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడైనా టెలికాం షేర్లు కొనవచ్చా? మరికొంత కాలం వేచి చూడాలా? అన్న ప్రశ్నలు మదుపరుల మస్కిష్కంలో కదలాడుతున్నాయి. ఎందుకంటే, టెలికాం రంగం కుదేలవడంతో.. తొందరపడి ఈ రంగంలో షేర్లు కొనకుండా మదుపరులు ఇప్పటి వరకు జాగ్రత్త వహించారు.
ప్రభుత్వం ఊరట, టారిఫ్ పెంపు...
జియో రంగ ప్రవేశంతో టెలికాం రంగంలో టారిఫ్ వార్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీ రేసులో అన్ని టెలికాం కంపెనీలు లాభపడకపోగా భారీగా నష్టపోయాయి. నష్టాల్లో ఉన్న టెలికాం కంపెనీలు కోలుకోవడానికి స్పెక్ట్రమ్ బకాయిల చెల్లింపు విషయంలో గడువు పెంచి కేంద్రంలోని మోడీ సర్కారు కొంత ఊరట కల్పించింది. మరోవైపు కాల్, డేటా టారిఫ్ పెంపునకు ట్రాయ్ కూడా అనుమతి ఇవ్వడంతో టెలికాం కంపెనీలకు రెవెన్యూపరంగా కొంత ఊరట లభించినట్లయింది. దీంతో చాలాకాలం తరువాత మూడు టెలికాం కంపెనీలు టారిఫ్లను పెంచాయి.
డౌన్ట్రెండ్ తగ్గించే ప్లాన్లు...
రెవెన్యూ డౌన్ట్రెండ్ను తగ్గించే ఉద్దేశంతో నెట్వర్క్ ప్రొవైడర్లు టారిఫ్లు కొంతవరకు పెంచాయి. వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్లు కనీస రీచార్జి ప్లాన్లపై దాదాపు 40 శాతం వరకు చార్జీలు పెంచాయి. అలాగే ఇతర పాపులర్ ప్లాన్లపై కూడా దాదాపు 25 నుంచి 40 శాతం వరకు పెంచాయి. దీంతో ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో వీటి రెవెన్యూ కొంతవరకు పెరగనుంది. ప్రత్యర్థి కంపెనీ జియో కూడా తన టారిఫ్ పెంచింది. అయితే ఎప్పటిలాగే తన ప్రత్యర్థులకంటే టారిఫ్ కొంత తక్కువ ఉండేలాగే చూసుకుంది.
ఒడాఫోన్ ఐడియా మనుగడ కష్టమే...
టారిఫ్ పెంపుపై హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ పెరిగిన మొత్తాలన్నీ నికర ఆదాయంలో ప్రతిబింబించకపోవచ్చని టెలికాం రంగ నిపుణులు భావిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో స్పెక్ట్రమ్ వేలం కూడా వస్తుందని, మరోవైపు ఏజీఆర్ బకాయిలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారం మొత్తాన్ని పెంచిన టారిఫ్లు పెద్దగా కవర్ చేయలేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒడాఫోన్ ఐడియా మనుగడ కష్టమేనని, పెరిగిన చార్జీల వల్ల దానికి పెద్దగా లాభం కలగకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇది మరో ఆర్కామ్ మాదిరిగా మారే ప్రమాదముందని, కాబట్టి మదుపరులు ఒడాఫోన్ ఐడియా షేర్లు కొనకపోవడమే శ్రేయస్కరమని చెబుతున్నారు.
టారిఫ్ పెంపు కలిసొచ్చేది ఎయిర్టెల్కే...
మరోవైపు టారిఫ్ పెంపు ఎయిర్టెల్కు బాగా కలిసి వస్తుందని, అలాగే వొడాఫోన్ ఐడియా కన్నా ఎయిర్టెల్ షేర్ మెరుగ్గా కనిపిస్తోందని నిపుణుల అంచనా. దీనికితోడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్వీకరించేందుకు ఎయిర్టెల్ సిద్ధంగా ఉందని, దీనికి సంబంధించి ఇప్పటికే అది ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపిందని, ప్రభుత్వ ఆమోదమే తరువాయి అది విదేశీ కంపెనీగా మారబోతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మదుపరులు ఎయిర్టెల్ షేర్లు నిరభ్యంతరంగా కొనవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు జియో కూడా త్వరలోనే లిస్టింగ్కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదేగనుక జరిగితే టెలికాం రంగంలో మరోసారి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండే అవకాశాలు ఉన్నట్లే.