ఒప్పొ..ఇక మేడిన్ హైదరాబాద్: నక్కతోక: 5జీ ఇన్నొవేషన్ ల్యాబ్: దేశంలోనే మొదటి యూనిట్
హైదరాబాద్: ప్రఖ్యాత స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పొ 5జీ ఇన్నొవేషన్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో ఏర్పాటు కాబోతోంది. 5జీ నెట్వర్క్ అభివృద్ధి, దానికి అవసరమైన స్మార్ట్ఫోన్ పరికరాల తయారీ, బ్యాటరీ, కెమెరా.. వంటి విభాగాలన్నీ ఇక హైదరాబాద్లోనే తయారు కానున్నాయి. ఈ 5జీ ఇన్నొవేషన్ ల్యాబ్కు అనుసంధానంగా పరిశోధన, అభివృద్ది (ఆర్ అండ్ డీ) సెంటర్ను కూడా ఒప్పొ యాజమాన్యం ఇక్కడే నెలకొల్పబోతోంది. కొద్దిసేపటి కిందటే ఒప్పొ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
చైనా వెలుపల మొదటిసారిగా..
ఒప్పొ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ.. చైనాకు చెందినది. తొలిసారిగా చైనా వెలుపల తన 5జీ ఇన్నొవేషన్ ల్యాబొరేటరీ, ఆర్ అండ్ డీ సెంటర్ను నెలకొల్పబోతోండటం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా ఈ సంస్థకు చెందిన ఎలాంటి ల్యాబొరేటరీలు గానీ, ఆర్ అండ్ డీ యూనిట్లు గానీ ప్రపంచంలో మరెక్కడా లేవు. అలాంటి.. తొలిసారిగా ఈ ల్యాబ్ను నెలకొల్పడానికి హైదరాబాద్ను ఎంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
భారత్ కేంద్రబిందువుగా
భారత్ను కేంద్రబిందువుగా చేసుకుని ఆసియాలోని ఇతర దేశాలకు ఒప్పొ హ్యాండ్ సెట్లను ఎగుమతులు చేయడంతో పాటు- స్మార్ట్ఫోన్ పనితీరును మరింత మెరుగు పర్చాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో 5జీ ఇన్నొవేషన్ ల్యాబ్ను నెలకొల్పబోతోన్నట్లు గ్వాంగ్డాంగ్ ఒప్పొ మొబైల్ టెలికమ్యూనికేషన్ల కార్పొరేషన్ లిమిటెడ్ భారత వైస్ ప్రెసిడెంట్ తస్లీమ్ ఆరిఫ్ తెలిపారు. భారత్లో 5జీ నెట్వర్క్ అభివృద్ధి కోసం పరిశోధనలు సాగుతున్నాయని, అందులో తాము కూడా భాగస్వామ్యం కాబోతోన్నామని అన్నారు.
ల్యాబొరేటరీలు.. ఆర్ అండ్ డీ సెంటర్..
ప్రపంచంలోనే ఇప్పటిదాకా ఎక్కడా లేని అత్యాధునిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ల్యాబొరేటరీని నిర్మించబోతోన్నామని ఆరిఫ్ స్పష్టం చేశారు. తమ వ్యాపార లావాదేవీలు అన్ని దేశాల్లోనూ కొనసాగుతున్నప్పటికీ.. ల్యాబొరేటరీ, ఆర్ అండ్ డీ సెంటర్లు మాత్రం ఎక్కడా లేవని పేర్కొన్నారు. హైదరాబాద్లో నెలకొల్పబోయే మొట్టమొదటి ల్యాబ్, ఆర్ అండ్ డీ సెంటర్తో.. విదేశాల్లో వాటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టయిందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో నెలకొల్పబోయే ల్యాబొరేటరీ కోసం త్వరలోనే భూమిపూజ చేస్తామని, దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొన్నారు.
పొరుగు దేశాల్లో..
మధ్య తూర్పు, ఆఫ్రికా, దక్షిణాసియా, జపాన్, యూరప్ దేశాల్లో ఇన్నొవేటివ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సంస్థ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 3,000 5జీ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను థర్డ్ జనరేషన్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ (3జీపీపీ)కి ఒప్పొ యాజమాన్యం అందజేసింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ ల్యాబొరేటరీతో వేలాదిమందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి.