Satyam Scam: రామలింగరాజుకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. సంచలన తీర్పు..!
Satyam Scam: సత్యం కంప్యూటర్స్ కంపెనీ కుంభకోణం సంగతి మనందరికీ తెలిసిందే. ఇది ఐటీ కంపెనీలు బూమ్ లో ఉన్న సమయంలో జరగింది. ఆ సమయంలో దేశంలోని స్టాక్ మార్కెట్లలో ఇది పెద్ద సంచలనాన్నే రేపింది. ఈ కేసులో తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన చేసింది.
ఆడిట్ సంస్థ ప్రైస్వాటర్ హౌస్ కూపర్స్ సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి రామలింగ రాజుపై చర్యలకు రంగంలోకి దిగింది. తమ ప్రతిష్ఠకు, వ్యాపారానికి జరిగిన నష్టానికి రూ.100 కోట్ల పరిహారం కోరుతూ దావా వేసేందుకు తెలంగాణ హైకోర్డు లైన్ క్లియర్ చేసింది. ఈ సంస్థ 2000-2009 మధ్య కాలంలో సత్యం కంప్యూటర్స్కు చట్టబద్ధమైన ఆడిటర్గా పనిచేసింది. ఈ క్రమంలో కంపెనీలో జరిగిన అతిపెద్ద అకౌంటింగ్ మోసాన్ని జనవరి 2009లో రామలింగ రాజు బయటకు వెల్లడించటం పెను ప్రకంపనలు సృష్టించింది.
కంపెనీ మోసపూరిత ప్రవర్తన ఖాతాదారులకు కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని PwC ఆరోపించింది. హైదరాబాద్లోని సివిల్ కోర్టు తీర్పుపై రామలింగరాజు దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్ను న్యాయమూర్తులు పి.నవీన్రావు, నగేష్ భీమపాకలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం కొట్టేసింది. ట్రయల్ కోర్టు 2012లో పిడబ్ల్యుసీ వాదనలకు వ్యతిరేకంగా రాజు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. కోర్టు తీసుకున్న నిర్ణయం కారణంగా ఆడిటింగ్ సంస్థ పీడబ్ల్యూసీ రామలింగరాజుతో పాటు అతని సహచరులపై రూ.100 కోట్ల కోసం దావాను దాఖలు చేసిన వ్యాజ్యాన్ని తిరిగి ప్రారంభించడానికి సివిల్ కోర్టు వీలు కల్పిస్తుంది.
సత్యం కంపెనీ కుప్పకూలటంతో 2009లో దానిని టెక్ మహీంద్రా సంస్థ కొనుగోలు చేసింది. ఆ సమయంలో రామలింగరాజుతో పాటు అతని సహచరులు రూ.223 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాలని టెక్ మహీంద్రా పీడబ్ల్యూసీతో కలిపి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను హైకోర్టు అనుమతించిందని తెలిపారు. ఈ క్రమంలో కోర్టులో వాదనలు వినిపించిన PwC.. కంపెనీతో తమకు ఉన్నది వృత్తిపరమైన సంబంధమని కాంట్రాక్ట్ కాదని వాధించింది. ఆడిటర్ వాటాదారులతో విశ్వసనీయ సంబంధాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు రామలింగరాజు వాదనలను తోసిపుచ్చింది.