ఆ రూట్లలోనే ప్రైవేటు బస్సులు: ఛార్జీలు, పాస్ల విషయంలో రిలీఫ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 5వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆ లోగా వచ్చి విధుల్లో చేరిన వారికి ఉద్యోగ భద్రత, రక్షణ కల్పిస్తామన్నారు. అదే సమయంలో ప్రయివేటీకరణ అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిక తదితర అంశాలపై స్పందించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఆర్టీసీని పరిరక్షించేందుకే పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అలర్ట్: మీరు ఇలా చేయకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం!
5100 రూట్లు ప్రయివేటుకు...
రాష్ట్రంలో మొత్తం 10,400 రూట్లకు గాను 5100 ప్రయివేటు బస్సులకు రూటు పర్మిట్లు ఇస్తామని కేసీఆర్ శనివారం స్పష్టం చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 5వ తేదీ వరకు కార్మికులు విధుల్లోకి రాకపోతే మిగతా 5100 రూట్లలోను ప్రయివేటు బస్సులకు అనుమతులు ఇస్తామని చెప్పారు. ఆరోగ్యకరమైన పోటీ, విస్తృతమైన, మెరుగైన రవాణా సదుపాయం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పర్మిట్లు ఇచ్చే విధానం యథాతథంగా ఉంటుందన్నారు.
పల్లె వెలుగు రూట్లే ప్రయివేటుకు.. కానీ
లాభాలు వచ్చే రూట్లు ఆర్టీసీకే ఉంటాయని కేసీఆర్ తెలిపారు. కఠినమైన.. పల్లె వెలుగు బస్సు మార్గాలను ప్రయివేటు వాళ్లకు ఇస్తారు. మోటార్ వాహనాల సవరణ చట్టం 2019 ప్రకారం ప్రభుత్వం ప్రయివేటు రూటు పర్మిట్లు ఎన్ని అయినా ఇవ్వవచ్చు. దీని ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ప్రయివేటు వచ్చినా ఛార్జీలు, పాసులు నియంత్రణలోనే..
కానీ ప్రయివేటు బస్సులు వచ్చినా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ఇష్టం వచ్చినట్లు టికెట్ ధరలు పెంచే అవకాశం ఇవ్వరు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అధ్యక్షతన ప్రభుత్వం నియమించే రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది. దాని నియంత్రణలో ప్రయివేటు వాళ్లు ఉంటారు. జర్నలిస్టులు, విద్యార్థులు, వికలాంగులు, టీఎన్జీవోలు.. ఇలా ఎవరెవరికి ఏయే బస్సు పాసులు అమల్లో ఉన్నాయో అవన్నింటిని యథావిథిగా కొనసాగిస్తారు. ప్రయివేటు రూట్లలో బస్సు ఛార్జీలు ఇష్టానుసారం పెంచేందుకు వీల్లేకుండా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఛార్జీల నియంత్రణ కమిటీ ఉంటుంది. బస్ పాసుల రాయితీలు యథావిధిగా కొనసాగుతాయి.
ఆర్థికమాంద్యం ప్రభావం లేదు
దేశమంతా ఆర్థికమాంద్యం ప్రభావం ఉన్నా తెలంగాణలో ఆ ప్రభావం లేదని కేసీఆర్ చెబుతున్నారు. గత అయిదేళ్లలో 21% వృద్ధిలో ఉన్నప్పటికీ, ఆర్థిక మాంద్యం ప్రభావంతో 16% తగ్గినట్లు చెబుతున్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం 31 శాతం వాటాతో ఆర్టీసీ బోర్డులో ఉంది. ఆ వాటా ఉన్న కేంద్రాన్ని అడిగిన తర్వాత కోర్టుకు చెబుతామని కేసీఆర్ అన్నారు. నష్టాల్లోను కేంద్రం వాటా భరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందట.
ఏపీతో పోల్చొద్దని కేసీఆర్
ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి, తెలంగాణకు పొంతన లేదని కేసీఆర్ చెబుతున్నారు. ఏపీలో ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. దానిని నెరవేర్చారు. కానీ తెలంగాణలో అలాంటి హామీ ఇవ్వలేదు. ఈ సందర్భంగా రైతులకు ఇచ్చే సాయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. ఏపీలో రైతు భరోసా కింద కేంద్రం ఇచ్చే రూ.6500తో కలిపి రూ.12500 ఇస్తున్నారు. కానీ ఐదెకరాలు ఉన్న రైతుకు తెలంగాణలో రూ.50వేలు ఇస్తున్నారు. రైతు బీమా కింద చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణలో రిస్క్ అలవెన్స్ ఇస్తున్నామని, ఏపీలో ఇవ్వడం లేదన్నారు.