RTGS సేవల్లో అంతరాయం, ఆర్బీఐ తాజా ట్వీట్ ఏమంటే?
అధిక మొత్తంలో ట్రాన్సాక్షన్స్ కోసం జరిపే RTGS (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) సేవలకు ఆదివారం అంతరాయం ఏర్పడింది. శనివారం అర్ధరాత్రి గం.12 నుండి ఆదివారం మధ్యాహ్నం గం.2 గంటల వరకు ఆర్టీజీఎస్ సేవలు నిలిచిపోతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవలే తెలిపింది. అర్ధరాత్రి 12 గంటల నుండి ఆర్టీజీఎస్ సేవలు నిలిచిపోయాయి. నెఫ్ట్ సేవలు మాత్రం యథావిధిగా పని చేశాయి. సాంకేతిక కారణాలతోనే ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేసింది.
ఏప్రిల్ 17న బిజినెస్ సమయం ముగిసిన అనంతరం ఆర్టీజీఎస్ వ్యవస్థలో సాంకేతికంగా కొత్త మార్పులు చేపడుతున్నామని, అందువల్ల ఏప్రిల్ 18న మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని, అయితే నెఫ్ట్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ట్విటర్ వేదికగా ఆర్బీఐ పేర్కొంది.
అయితే టెక్నికల్ అప్గ్రెడేషన్ అనుకున్న సమయం కంటే కాస్త ముందే పూర్తయింది. ఈ మేరకు ఆర్బీఐ మధ్యాహ్నం రెండు గంటలకు ట్వీట్ చేసింది. రెగ్యులర్ ఆర్టీజీఎస్ సేవలు ఏప్రిల్ 18వ తేదీ గం.11.45 నుండి అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. అనుకున్న సమయంలోగా అప్ గ్రేడెషన్ పూర్తి చేసిన ఆర్బీఐ పైన నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.