మార్చి నాటికి 90 శాతం ఉద్యోగులు కార్యాలయాలకు, ఉద్యోగాలకు వ్యాక్సీన్..
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏడాదికి పైగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గడం, థర్డ్ వేవ్ ప్రభావం పట్ల అందరూ అప్రమత్తంగా ఉండటం, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావొస్తున్న నేపథ్యంలో తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ సంస్థలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 5 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారని, డిసెంబర్ నాటికి ఇది యాభై శాతానికి చేరుకోవచ్చునని హైదరాబాద్ సాఫ్టువేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్(HYSEA) సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు HYSEA నిర్వహించిన ఫ్యూచర్ వర్క్ మోడల్ సర్వేలో పలు అంశాలు వెల్లడయ్యాయి.
మార్చి నాటికి 90 శాతం ఉద్యోగులతో
500 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న ఐటీ సంస్థలలో ఇప్పటికే 20 శాతం మంది ఆఫీస్లకు వస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 76 శాతం కంపెనీల్లో తొమ్మిది శాతం మంది, మధ్యస్థాయి, పెద్ద, అతి పెద్ద కంపెనీల ఉద్యోగులలో 5 శాతం మంది కార్యాలయాలకు వస్తున్నారని ఈ సర్వే పేర్కొంది. అదే సమయంలో ప్రస్తుత గ్లోబల్ ట్రెండ్స్కు అనుగుణంగా హైబ్రిడ్ విధానంలో పని చేయించేందుకు 70 శాతం కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. డిసెంబర్ నాటికి 73 శాతం కంపెనీలు కనీసం 10 శాతం నుండి 50 శాతం మందితో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రారంభించాలని భావిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి 79 శాతం కంపెనీలు గరిష్టంగా 90 శాతం ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రారంభించాలని భావిస్తున్నాయి.
హైబ్రిడ్ వర్కింగ్ మోడల్
ఈ డిసెంబర్ నాటికి తమ ఉద్యోగులందరినీ ఆఫీసుకు రప్పించాలని 33 శాతం కంపెనీలు, 2022లో ఈ పని పూర్తి చేయాలని 41 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి. హైదరాబాద్ నగరంలో ఆరు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే, రెండు లక్షల మంది దూర ప్రాంతాల నుండి పని చేస్తున్నారు. డెబ్బై శాతం కంపెనీలు హైబ్రిడ్ వర్కింగ్ మోడల్కు మొగ్గు చూపుతున్నాయి. కరోనా వ్యాక్సీన్ రెండు డోసులు పూర్తయిన వారిని వారానికి మూడు రోజులు ఆఫీసుకు రప్పించాలని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. కొన్ని చిన్న సంస్థలు మాత్రం వ్యాక్సీన్ వేయించుకుంటేనే అనుమతికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది.
ఉత్పాదకత తగ్గింది
వర్క్ ఫ్రమ్ హోం వల్ల ఉత్పాదకత తగ్గిందని 22 శాతం సంస్థలు తెలిపాయి. క్లయింట్స్ కోసం ఉద్యోగులను ఆఫీస్లకు రప్పించాలని 27 శాతం సంస్థలు చెబుతున్నాయి. అనుబంధ రంగాలను దృష్టిలో పెట్టుకుని, ఉద్యోగులను కార్యాలయానికి రప్పించాలని భావిస్తున్నట్లు 39 శాతం కంపెనీలు వెల్లడించాయి. స్కూల్స్, కాలేజీలు ప్రారంభం కానందున నేపథ్యంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులు అయితే పిల్లలను ఎవరు చూసుకుంటారనే ఆందోళన కనిపిస్తోంది. అలాగే, తమ ఉద్యోగులు కనీసం ఒక్క డోస్ వ్యాక్సీన్ అయినా తీసుకుని ఉండవచ్చునని 84 శాతం కంపెనీలు భావిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే, ఉద్యోగాల భర్తీలో వ్యాక్సీన్ సర్టిఫికెట్ అడిగే అవకాశముందని భావిస్తున్నారు.
అధిక శాలరీ ప్రభావం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ కంపెనీలకు 9 శాతం నుండి 12 శాతం రెవిన్యూ వృద్ధికి వీలు ఉన్నప్పటికీ, అధిక వేతనాల కారణంగా లాభాలు తగ్గవచ్చునని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ తెలిపింది.