ఆదాయపుపన్ను రిటర్న్స్ గడువు తేదీ మూడు నెలలు పొడిగింపు, TDSపై శుభవార్త
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్నారు. అయితే గత రెండున్నర నెలలుగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (మే 13) మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్కు సంబంధించి ఊరట కల్పించారు.

ఐటీ రిటర్న్స్పై గడువు
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు తేదీని పొడిగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అన్ని ఐటీ రిటర్న్స్కు సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఐటీ రిటర్న్స్కు సంబంధించి 31 జూలై 2020 మరియు 31 అక్టోబర్ 2020 గడువులను 30 నవంబర్ 2020కి పొడిగిస్తున్నట్లు చెప్పారు. అలాగే ట్యాక్స్ ఆడిట్ తేదీని 30 సెప్టెంబర్ 2020 నుండి 31 అక్టోబర్ 2020కి పొడిగించారు.

టీడీఎస్ 25 శాతం తగ్గింపు
నాన్ శాలరైడ్ ఆదాయంపై మూల ధనంపై పన్ను (TDS)ను 25 శాతం తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ ప్రకటన వల్ల పన్ను చెల్లింపుదారుల వద్ద ఎక్కువ నిధులు ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేవరకు ఇది అమలులో ఉంటుందని తెలిపారు. అంటే 2021 మార్చి వరకు ఇది వర్తిస్తుంది.

రూ.50,000 కోట్లు ప్రజల చేతుల్లో..
టీడీఎస్ను 25 శాతం తగ్గించడం వల్ల జనాల చేతుల్లో రూ.50,000 కోట్ల వరకు ఉంటాయని తెలిపారు. ఈ మొత్తం లేదంటే పన్నుగా ప్రభుత్వం ఖాతాలోకి వెళ్లేది. ఇప్పుడు డిమాండ్ పెంచే ఉద్దేశ్యంలో భాగంగా దీనిని తగ్గించినట్లుగా భావిస్తున్నారు. కాంట్రాక్ట్, ప్రొఫెషనల్ ఫీజు, వడ్డీ, రెంట్, డివిడెండ్, కమిషన్, బ్రోకరేజీ ఇన్కం వంటి వాటి కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది రేపటి నుండి అమల్లోకి వస్తుంది. మిగతా ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది.


Click it and Unblock the Notifications