TCS: Q3లో టీసీఎస్ కళ్లు చెదిరే లాభాలు.. టీసీఎస్ ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబే..! అందుకే..
TCS: అంతర్జాతీయ మందగమనంతో ఐటీ రంగంలోని కంపెనీలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులనూ తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో విడుదలైన టీసీఎస్ Q3 ఫలితాలు మెరుగైన లాభాలను నమోదు చేసింది.
బంపర్ లాభాలు..
డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను టీసీఎస్ విడుదల చేసింది. ఈ క్రమంలో కంపెనీ రెవెన్యూ 19 శాతం పెరగగా.. పన్నుల తర్వాత లాభం 11 శాతం మేర పెరిగింది. కంపెనీ తన మూడో త్రైమాసికంలో రూ.10,846 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. టీసీఎస్ గతంలో కంటే మెరుగైన ఫలితాలను నమోదు చేసినప్పటికీ అవి ఇన్వెస్టర్ల అంచనాలను మిస్ అయ్యాయి.
నష్టపోయిన స్టాక్..
దేశీయ అగ్రగామి టెక్ కంపెనీ టీసీఎస్ స్టాక్ క్యూ-3 ఫలితాల విడుదల తర్వాత 2 శాతం మేర నష్టపోయింది. కంపెనీ యూరప్ కస్టమర్లు మాంద్యం కారణంగా ఖర్చులను తగ్గించటంలో భాగంగా ప్రాజెక్టులపై వ్యయాలను గణనీయంగా తగ్గించాయి. దీంతో కంపెనీ తన మూడో త్రైమాసికానికి అంచనాలను అందుకోలేక పోయింది. దీంతో ఇన్వెస్టర్ల ఆశలు గల్లంతయ్యాయి. ప్రపంచ ఆర్థిక మందగమనం కంపెనీ ఆదాయాలపై ప్రభావం చూపినందునే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు వెల్లడించారు.
ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు..
చాలా మంది ఉద్యోగులు చెప్పే మాటేంటంటే టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటే అది ప్రభుత్వ ఉద్యోగంతో సమానమని అంటుంటారు. ఈ మాట నిజమేనని చెప్పుకోవటానికి ఒక బలమైన ఆధారం దొరికింది. అదేంటంటే.. పదేళ్లకు పైగా టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 1.25 లక్షలుగా ఉండటమే దీనికి కారణం. ఒక విధంగా ఇది కంపెనీ గర్వించాల్సిన విషయమని చెప్పుకోవచ్చు.
ఉద్యోగుల సంఖ్య..
డిసెంబర్ 2022 త్రైమాసికం చివరి నాటికి కంపెనీ మెత్తంగా 6,13,974 ఉద్యోగులను కలిగి ఉంది. అంతకు ముందు సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ సంఖ్య 6,16,171గా ఉంది. అలాగే ఉద్యోగులు అట్రిషన్ రేటు మూడవ త్రైమాసికంలో 21.3 శాతంగా ఉన్నట్లు కంపెనీ తన ఫైలింగ్స్ లో వెల్లడించింది.
నైపుణ్యాల విషయంలో..
కంపెనీ తన ఉద్యోగులకు ఎల్లప్పుడూ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు అవకాశం కల్పిస్తూనే ఉంది. ఇది ఉద్యోగుల్లో వైవిద్యాన్ని పెంపొందించటంతో పాటు కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు మెరుగైన అవకాశాలను ఇస్తుందని కంపెనీ భావిస్తోంది. ఉద్యోగుల గ్రోత్ కు సరైన అవకాశాలను కల్పించటంతో పాటు, మంచి వర్క్ కల్చర్ ఇతర ప్రయోజనాలను కల్పిస్తున్నందున కంపెనీలో ఉద్యోగులు ఎక్కువ కాలం పనిచేసేందుకు మెుగ్గుచూపుతున్నారు. పైగా ఇది తక్కువ అట్రిషన్ రేటుకు కూడా దారితీస్తుంది.
ఇన్వెస్టర్లకు డివిడెండ్..
కంపెనీలు తమకు వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని తన పెట్టుబడిదారులకు డివిడెండ్ రూపంలో అందిస్తుంటాయి. తాజాగా క్యూ3 ఫలితాలను వెల్లడించిన టీసీఎస్ 2023 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.75 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.