TCS Q3 results: టీసీఎస్ 18,000 కోట్ల బైబ్యాక్, భారీ నియామకాలు
ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను బుధవారం ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంలో మంచి ఆదాయాలు, లాభాలను నమోదు చేసింది. సంస్థ ఏకీకృత నికర లాభం రూ.9,769 కోట్లుగా నమోదయింది. ఏడాది ప్రాతిపదికన 12.2 శాతం అధికం. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.8,701 కోట్లుగా ఉంది. ఆదాయం 16 శాతం పెరిగి రూ.42,015 కోట్ల నుండి రూ.48,885 కోట్లకు చేరింది. నిపుణులను అట్టిపెట్టుకొని.. ఆట్రిషన్ రేటును తగ్గించే ఉద్దేశ్యంలో భాగంగా లక్షమందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం, కొత్త నియామకాల నేపథ్యంలో కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్లు 0.60 శాతం తగ్గి 25 శాతానికి పరిమితమయ్యాయి.
స్టాక్ బైబ్యాక్
టీసీఎస్ రూ.18,000 కోట్ల (1.08 శాతం) బైబ్యాక్ పథకాన్ని ప్రకటించింది. షేర్ ఒక్కో దానికి రూ.4500 ధరతో 4 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు ప్రకటించింది. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు పచ్చజెండా ఊపింది. బుధవారం టీసీఎస్ షేర్ రూ.3857.25 వద్ద ముగిసింది. దీంతో పోలిస్తే 16.6 శాతం అధికం. ఒక్కో షేర్కు రూ.3000 చొప్పున రూ.16,000 కోట్ల బైబ్యాక్ను 2020 డిసెంబర్ 18న కూడా ప్రకటించింది.అలాగే ఒక్కో షేర్ పైన రూ.7 చొప్పున డివిడెండ్ను ఇస్తున్నట్లు తెలిపింది. డివిడెండ్ చెల్లింపుకు జనవరి 20 రికార్డ్ తేదీగా నిర్ణయించింది.
ఐటీకి కేటాయింపులు
2021 క్యాలెండర్ ఏడాదిలో టీసీఎస్ రూ.1,87,500 కోట్ల ఆదాయ మైలురాయిని అధిగమించింది. అధిక వ్యయాలను తగ్గించుకోవడంపై, ఉద్యోగుల వ్యయాలను సరిగ్గా నిర్వహించడంపై తమ దృష్టి కొనసాగుతుందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ షెక్సారియా తెలిపారు. చాలావరకు కొత్త క్లయింట్స్ కొత్త ఏడాదిలో ఐటీకి కేటాయింపులు జరుపుతున్నందున రాబోయే రోజుల్లోను రాణించగలమన్నారు. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ 7.8 బిలియన్ డాలర్ల కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసిందన్నారు.
భారీ నియామకాలు
2021 డిసెంబర్ 21 నాటికి కంపెనీలో 28,238 నియామకాలు చేపట్టింది. దీంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2,56,986కు చేరుకుంది. ఉద్యోగుల వలస రేటు (ఆట్రిషన్ రేటు) 15.3 శాతంగా నమోదయింది. కంపెనీ వద్ద నిల్వలు రూ.59,920 కోట్లుగా ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 43,000 మంది ఫ్రెషర్లను తీసుకున్నది. మూడో త్రైమాసికంలో మరో 34,000 మందిని నియమించుకుంది. 9 నెలల్లో 77,000 నియామకాలు చేపట్టింది.