TCS Q3 results: అదరగొట్టిన టీసీఎస్, ఒక్కో షేర్ పైన రూ.6 డివిడెండ్
ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) Q3 ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. అంచనాలకు మించిన ఫలితాలతో అదరగొట్టింది టీసీఎస్. 2020-21 ఆర్థిక ఏడాదిలో మూడో త్రైమాసికంలో సగటు లాభం 7 శాతం ఎగిసి రూ.8,701 కోట్లుగా నమోదయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అదే త్రైమాసికంలో రూ.8,118 కోట్లుగా నమోదయింది. ఒక్కో షేర్కు కంపెనీ రూ.6 డివిడెండ్ను ప్రకటించింది. కంపెనీ ఆదాయం 5 శాతం పెరిగి రూ.42,015 కోట్లుగా నమోదయింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.39,854 కోట్లుగా ఉంది. శుక్రవారం మార్కెట్ ముగిసిన అనంతరం టీసీఎస్ కంపెనీ ఫలితాలు ప్రకటించింది.
పదేళ్లలోనే ఐటీ సెక్టార్కు తొలిసారి! టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాభం జంప్కు అవకాశం
అదరగొట్టిన టీసీఎస్
డిసెంబర్ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 7.1 శాతం వృద్ధిని నమోదు చేసిన టీసీఎస్, త్రైమాసికం పరంగా 16.4 శాతం వృద్ధిని సాధించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కాస్త క్షీణించింది. అయితే ఆ తర్వాత కంపెనీలు ఐటీ సేవల వైపు మొగ్గు చూపుతుండంతో డిమాండ్ పెరిగింది. ఎపిక్తో లిటిగేషన్ కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో పోస్ట్ ట్యాక్స్ వన్ టైమ్ ప్రభావం పడింది. ఇక, డిసెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ రెవెన్యూ 4.7 శాతం పెరిగి రూ.42,015 కోట్లుగా నమోదయింది. ఏడాది ప్రాతిపదికన 5.4 శాతం ఎగిసింది.
విశ్లేషకుల అంచనాలకు మించి
త్రైమాసికం ప్రాతిపదికన స్థిర కరెన్సీలో రెవెన్యూ గ్రోత్ 4.1 శాతం వృద్ధిని నమోదు చేసి, విశ్లేషకుల అంచనాలను మించింది. సాధారణంగా ఐటీ రంగానికి డిసెంబర్ క్వార్టర్ బలహీనంగా ఉంటుంది. వృద్ధి 2.8 శాతం నుండి 2.9 శాతం మధ్య ఉంటుందని అంచనా వేయగా, అంచనాలను మించింది. డాలర్ రెవెన్యూ గ్రోత్ 5702 మిలియన్ డాలర్లుగా నమోదయింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 5.1 శాతం వృద్ధి సాధించింది. అంచనాలు రూ.5600 కోట్లుగా ఉండగా, దీనిని మించింది.
రూ.6 డివిడెండ్
కోర్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు పెరుగుతున్న డిమాండ్, సంస్థ చేసుకున్న గత ఒప్పందాలు డిసెంబర్ త్రైమాసికంలో మంచి లాభాలకు తోడ్పడిందని టీసీఎస్ సీఈఓ,మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ తెలిపారు. తమ మార్కెట్ గతంలో కంటే బలంగా ఉందని, సరికొత్త ఆశావాదంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టామన్నారు. కాగా, టీసీఎస్ ఒక్కో షేర్ పైన రూ.6 డివిడెండ్ ప్రకటించింది.