కొత్త రికార్డ్, TCS రూ.10లక్షల కోట్ల మార్కెట్ క్యాప్: ఇన్వెస్టర్ల సంపద రూ.69వేల కోట్లు జూమ్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(అక్టోబర్ 5) భారీ లాభాల్లో ముగిశాయి. 7వ తేదీన టీసీఎస్ ఫలితాలు, షేర్ల బైబ్యాక్ ఉంది. క్వార్టర్ ఫలితాలు సానుకూలంగా ఉంటాయనే అంచనాల నేపథ్యంలో నిఫ్టీ ఐటీ 3 శాతానికి పైగా లాభపడింది. ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఏడు శాతానికి పైగా లాభపడింది. బుధవారం టీసీఎస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ భేటీలో షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలిస్తారనే వార్తలు వచ్చాయి. దీంతో టీసీఎస్ షేర్ ధర అంతకంతకూ ఎగిసింది. ముఖేష్ అంబానీ నెతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ మరో ఘనత సాధించింది.
ఐటీ దూకుడుకు టీసీఎస్ కీలకం, ఇక ఫార్మాలో లాభాల స్వీకరణ!
టీసీఎస్ రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్
టీసీఎస్ షేర్ ధర ఈ రోజు 7.55 శాతం (రూ.190.50) ఎగిసి రూ.2,713.95 కోట్ల వద్ద ముగిసింది. దేశంలో రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన మొదటి సంస్థ రిలయన్స్. ఇటీవలే ఇది రూ.15 లక్షల కోట్లను కూడా తాకింది. మార్కెట్ క్యాప్లో రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ ఈరోజు రూ.10 లక్షల కోట్లను దాటింది. స్టాక్స్ 6 శాతం(రూ.2,679) లాభాల్లో ఉన్నప్పుడే మార్కెట్ క్యాప్ ఈ మార్క్ను చేరుకుంది. టీసీఎస్కు ఈ ధర ఆల్ టైమ్ రికార్డ్. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.15 లక్షల కోట్లకు చేరుకుంది. గత నెలలో మార్కెట్ క్యాప్ రూ.9 లక్షల కోట్లను తాకింది. ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.15,02,355.71 కోట్లుగా ఉంది.
ఒక్కరోజు రూ.69వేల కోట్లు
టీసీఎస్ ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్కరోజు రూ.69,000 కోట్లు ఎగిసింది. బుధవారం టీసీఎస్ బోర్డు మీటింగ్ ఉంది. ఇందులో షేర్ల బైబ్యాక్ పాలసీపై నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ ఆర్థిక ఫలితాలు కూడా విడుదల చేయనుంది. 2018లో టీసీఎస్ షేర్ల బైబ్యాక్ పాలసీకి శ్రీకారం చుట్టింది. రూ.16వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు తీసుకుంది. ఇప్పటికే రూ.2,100 కోట్ల విలువైన 7.61 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది.
టీసీఎస్ దూకుడు కొనసాగుతుంది
సెప్టెంబర్ క్వార్టర్కు గాను టీసీఎస్ ఫలితాలు ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు షేర్ల బైబ్యాక్ ప్లాన్తో ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ ధర మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఐటీ రంగానికి మంచి రోజులు ఉన్నాయని చెబుతున్నారు. నేడు
TCS ధర 7.55 శాతం లాభపడి రూ.2,714 వద్ద, హెచ్సీఎల్ టెక్ 1.27 శాతం లాభపడి రూ.823.30 వద్ద, ఇన్ఫోసిస్ షేర్ ధర 2.94 శాతం లాభపడి రూ.1,047.60 వద్ద, టెక్ మహీంద్రా షేర్ వ్యాల్యూ 2.78 శాతం లాభపడి రూ.845 వద్ద, విప్రో షేర్ వ్యాల్యూ 7 శాతం లాభపడి రూ.335 వద్ద, కోఫోర్జీ షేర్ ధర 0.26 శాతం లాభపడి రూ.2,341 వద్ద ముగిసింది. ఐటీ షేర్లు అన్నీ మంచి లాభాల్లో ముగిశాయి.