టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఐటీ కంపెనీలపై యాక్సెంచర్ ఎఫెక్ట్! ఎందుకంటే?
ముంబై: భారత ఐటీ కంపెనీలు గతవారం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మొదటి మూడు సెషన్లలో మిగతా స్టాక్స్ నష్టపోయినప్పటికీ ఐటీ స్టాక్స్ లాభపడ్డాయి. గురువారం నాటి సెషన్లో సెన్సెక్స్ ఏకంగా 1,115 పాయింట్లు నష్టపోయిన సమయంలో ఐటీ స్టాక్స్ మూడు శాతం మేర నష్టపోయాయి. అయితే మరుసటి రోజు ఐటీ స్టాక్స్ తిరిగి లాభాల్లోకి వచ్చాయి. మార్కెట్ లాభాలకు ఐటీ స్టాక్స్ ప్రధానంగా ఊతమిచ్చాయి. ఐటీ స్టాక్స్కు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ ఫలితాలు కొత్త ఊఫును ఇచ్చాయి. ఔట్ సోర్సింగ్ డీల్స్ భారీగా పెరిగాయి. అలాగే, అంతకుముందే వచ్చిన ఈ ఐటీ కంపెనీ క్వార్టర్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో ఐటీ స్టాక్స్ శుక్రవారం పుంజుకున్నాయి.
అక్టోబర్ 1 నుండి కొత్త నిబంధనలు, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియం 20% వరకు భారం!
ఐటీ స్టాక్స్ 3 శాతం జూమ్.. యాక్సెంచర్ ఫలితం..
గతవారం చివరి సెషన్లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అన్నీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. కోఫోర్జీ, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ 3 శాతం నుండి 3 శాతానికి పైగా లాభపడ్డాయి. భారత్ టాప్ 5 ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోస్స్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా లాభాల్లో ముగిశాయి. అంతకుముందు రోజు యాక్సెంచర్ ఫలితాలు వచ్చాయి. ఈ దిగ్గజ కంపెనీ ఫలితాలు అంచనాలకి మించి ఉన్నాయి. 2019 అదే క్వార్టర్తో పోలిస్తే 2020లో ప్రకటించిన నాలుగో త్రైమాసికం ఫలితాలు 2 శాతం మాత్రమే క్షీణించాయి. 2019లో 11.06 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈసారి 10.8 బిలియన్ డాలర్లుగా ఉంది. క్యూ4 నెట్ ఇన్కం గత ఏడాది ఇదే కాలంలో 1.15 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈసారి 1.12 బిలియన్ డాలర్లుగా ఉంది.
కొత్త డీల్స్... ఔట్ సోర్సింగ్ డీల్స్
యాక్సెంచర్ పూర్తి ఏడాది ఆదాయం 44.3 బిలియన్ డాలర్లుగా ఉంది. 2019తో పోలిస్తే 3 శాతం పెరిగింది. అయితే రెవెన్యూ గ్రోత్ మాత్రం 1 శాతం క్షీణించింది. ట్రావెల్ రీయింబర్సుమెంట్స్ రెవెన్యూ తగ్గింది. అయితే యాక్సెంచర్ రికార్డ్ స్థాయిలో 14 బిలియన్ డాలర్ల కొత్త డీల్స్ కుదుర్చుకుంది. ఇందులో దాదాపు సగం ఔట్ సెర్సింగ్ సెగ్మెంట్ నుండి వచ్చాయి. కొత్త కన్సల్టింగ్ ఆర్డర్స్ 6.5 బిలియన్ డాలర్లు, కొత్త ఔట్ సోర్సింగ్ ఆర్డర్స్ 7.5 బిలియన్ డాలర్లు ఉన్నాయి. కొత్త పెద్ద క్లయింట్స్(100 మిలియన్ డాలర్లకు పైగా) 17 మంది వచ్చారు. రెవెన్యూలో పెరుగుదల హెల్త్, పబ్లిక్ సర్వీసెస్ నుండి పెరుగుదలను చూసింది. యాక్సెంచర్ 2021 ఆర్థిక సంవత్సరానికి గాను తమ మొదటి క్వార్టర్ ఫలితాలు 11.15 బిలియన్ డాలర్ల నుండి 11.55 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. కొత్త డీల్స్, అంచనాల కంటే ఫలితాలు పెరగడం వంటి కారణాలు ఐటీ సెక్టార్కు కాస్త ఊతమిచ్చాయి.
అందుకే.. పుంజుకున్నాయి.
యాక్సెంచర్ ఆదాయంలో హెల్త్కేర్ బలంగా ఉంది. రిటైల్, తయారీ, ట్రావెల్ రెవెన్యూ 30 శాతం నుండి 35 శాతం మేర క్షీణించింది. త్రైమాసిక వృద్ధి పరంగా హెల్త్ అండ్ పబ్లిక్ సర్వీసెస్లో 3.2 సాతం, ఉత్పత్తుల్లో 0.5 శాతం ఉంది.
యాక్సెంచర్ ఆధారంగా రెవెన్యూ క్షీణించినప్పటికీ అంచనాలు మించడం, కొత్త బుకింగ్స్ పెరగడం, 2021 ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగా ఉంటుందని పేర్కొనడం, కీలకమైన ఏరియాల్లో బిజినెస్ తిరిగి పెంచుకోవడం వంటి వివిధ అంశాలు ఐటీ రంగానికి.. ఇండియన్ ఐటీ రంగానికి కూడా ఊతమిస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో గత సెషన్లో ఐటీ స్టాక్స్ పుంజుకున్నాయి.