TCS News: టీసీఎస్ సీఈవో రాజీనామా.. అసలేం జరుగుతోంది.. మార్కెట్ రియాక్షన్ ఏంటి..?
TCS CEO: దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ కంపెనీతో 22 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కంపెనీకి రాజీనామా చేసి వీడారు. ఆయన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, CEOగా ఆరు ఏళ్లు సేవలు అందించారు. తాజాగా మార్చి 16 నుంచి కె కె కృతివాసన్ ను సీఈవోగా నియమించబడ్డారు. కొత్తగా సీఈవోగా కంపెనీ నిర్ణయించిన కృతివాసన్ 1989 నుంచి సంస్థలో అనేక హోదాల్లో తన ప్రయాణాన్ని కొనసాగించారు.
టీసీఎస్ ఛైర్మన్, బోర్డుతో చర్చించిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజేష్ గోపీనాథన్ తెలిపారు. తన పర్సనల్ అభిరుచులకు సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గోపీనాథన్ నేతృత్వంలో టీసీఎస్ టీసీఎస్ ఆదాయం పెరగటంతో పాటు కంపెనీ మార్కెట్ క్యాప్ 70 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్లౌడ్, ఆటోమేషన్ వంటి ఆధునిక టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టడంలో గోపీనాథ్ కీలక పాత్ర పోషించారు. టెక్ రంగంలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా కంపెనీని ముందుకు నడిపించటంలో గత ఆరేళ్లుగా ఆయన కృషి చేశారు.
టెక్ దిగ్గజం టీసీఎస్ యాజమాన్యంలో అకస్మాత్తుగా మార్పులు వచ్చాయి. ఈ మార్పులతో మార్కెట్లు ఆశ్చర్యానికి గురయ్యాయి. గోపీనాథన్ నాయకత్వంలో 2017 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ ఆదాయం రూ.1.18 లక్షల కోట్ల నుంచి 63 శాతం పెరిగి.. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.1.92 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే తాజా మార్పులతో కంపెనీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ వ్యాపారానికి ప్రస్తుత గ్లోబల్ హెడ్, కె కృతివాసన్ను CEOగా నియమించింది. సెప్టెంబర్ 2023 నుంచి కృతివాసన్ టీసీఎస్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
యాజమాన్య మార్పుల నేపథ్యంలో టీసీఎస్ స్టాక్ స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్ ప్రారంభించినప్పటికీ.. 10.13 గంటల సమయంలో స్వల్పంగా లాభపడి రూ.3,187.90 వద్ద ట్రేడవుతోంది. బ్రోకరేజ్ సంస్థలు సైతం స్టాక్ పై సానుకూలంగా ఉన్నాయి. సీఎల్ఎస్ఏ కంపెనీ టార్గెట్ ధరను రూ.3,550గా నిర్ణయించింది. కోటక్ సెక్యూరిటీస్ సైతం తన టార్గెట్ ధరను అప్ డేట్ చేసింది.