నవంబర్ 15 నాటికి ఆఫీస్కు రండి: ఉద్యోగులకు టీసీఎస్
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఉద్యోగులు త్వరలో కార్యాలయాలకు రానున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏడాదిన్నరకు పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతోంది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు దేశీయ ఐటీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 15వ తేదీ నాటికి కార్యాలయాలకు రావాలని అందరి ఉద్యోగులకు సూచించింది. ఇప్పటికే విప్రో కూడా తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండటం సహా వివిధ కారణాలతో కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీస్లకు పిలిపిస్తున్నాయి. ఈ క్రమంలో విప్రో నెల రోజుల క్రితం తన కంపెనీ ఉద్యోగులను ఆఫీస్కు రావాలని ఆదేశించింది. సెకండ్ డోస్ పూర్తయిన వారిని విధులకు అనుమతించింది. హైబ్రిడ్ మోడల్ వర్క్ విధానంలో వారానికి 2 రోజులు ఆఫీస్ నుండి పని చేయాలని పేర్కొంది. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ నెల రోజుల క్రితం ట్వీట్ చేశారు.
పద్దెనిమిది నెలల తర్వాత తమ ఉద్యోగులు వారానికి 2 రోజులపాటు కార్యాలయానికి వస్తున్నారని, సెకండ్ డోస్ వ్యాక్సీన్ అయిన వారు సురక్షితంగా వచ్చి వెళ్లేలా, సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశామని అప్పుడు రిషద్ తెలిపారు. ఆఫీస్, ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో పాటించాల్సిన నిబంధనలు, కొవిడ్ సేఫ్టీ ప్రొటోకాల్స్ పైన రూపొందించిన వీడియోను కూడా ట్వీట్ చేశారు. జులై నాటికి విప్రో ఉద్యోగుల్లో దాదాపు 55 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సంస్థలో 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుండి పలు కంపెనీలు ఉద్యోగులను కార్యాలయానికి రప్పించే ప్రణాళికలతో ఉన్నాయి.