మిస్త్రీ గ్రూప్కు టాటా సన్స్ రూ.21,000 కోట్ల ఆఫర్! TCS నుండి మెజార్టీ వాటా
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్నకు (SP గ్రూప్) చెందిన 18.4శాతం వాటాని కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ సిద్ధమైంది. ఇందుకు 3 బిలియన్ డాలర్లు (రూ.21,900 కోట్లు) ఆఫర్ చేయవచ్చునని తెలుస్తోంది. భారత దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ అక్టోబర్ 28న సుప్రీం కోర్టులో ప్రతిపాదనకు సంబంధించి నివేదిక ఇవ్వనుంది. మిస్త్రీ గ్రూప్కు చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్, టాటా గ్రూప్ మధ్య గత కొన్నాళ్ళుగా వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
షాకింగ్! అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీ ఆర్థిక సాయం చేయలేదా? ఏం జరిగిందంటే...
టీసీఎస్ నిధులు
SP గ్రూప్ వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేయడం కోసం అవసరమైన నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే గ్రూప్కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఏర్పాటు చేయనుందట. టీసీఎస్లో మాతృసంస్థ టాటా గ్రూప్ వాటా 72 శాతం ఉంది. ఇటీవలషేర్ల బైబ్యాక్ను ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.21వేల కోట్లకు గాను టీసీఎస్ షేర్ బైబ్యాక్ ద్వారా రూ.11,528 కోట్లు అంచనా వేస్తున్నారు. బైబ్యాక్ లేకుంటే టాటా సన్స్.. టీసీఎస్లో ఎక్కువ వాటాను విక్రయించాల్సి ఉంటుందని ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్(IiAS) ఏప్రిల్ 23న నోట్లో పేర్కొంది. టీసీఎస్లో 16 శాతం వాటాను విక్రయిస్తే టాటా సన్స్ గ్రూప్ను కలిపి ఉంచే సామర్థ్యం బలహీనపడుతుందని పేర్కొంది.
టాటా సన్స్ బైబ్యాక్ క్లాజ్..
టీసీఎస్ నుండి వచ్చే నిధులు మిస్త్రీ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేసేందుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. టాటా సన్స్ బయటి ఇన్వెస్టర్లతోను చర్చలు జరుపుతోంది. సావరీన్, పెన్షన్ ఫండ్స్తో చర్చలు జరుపుతోందని, వచ్చే రెండు వారాల్లో దీనిపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. వాటాను కొనుగోలు చేసేందుకు పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, టాటా సన్స్కు పొటెన్షియల్ ఇన్వెస్టర్ కీలకం అంటున్నారు. నిబంధనల్లో టాటా సన్స్ బైబ్యాక్ క్లాజ్ కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
విక్రయానికి మిస్త్రీ కుటుంబం మొగ్గు
మిస్త్రీ కుటుంబం కూడా విక్రయించడానికి మొగ్గు చూపుతోంది. అయితే వ్యాల్యుయేషన్ దగ్గర చిక్కుముడి ఉండవచ్చునని అంటున్నారు.
బాండ్స్ చెల్లంపులకు అవసరమైన నిధులను సమీకరించాలని ఎస్పీ గ్రూప్ భావిస్తే ఆ గ్రూప్కు ఉన్న 18.4 శాతం వాటాను కొనుగోలు చేస్తామని సుప్రీం కోర్టుకు టాటా సన్స్ తరఫు లాయర్ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎస్పీ గ్రూప్ షేర్ల తనఖా ద్వారా నిధులు సమీకరించాలని భావిస్తే ఆ షేర్లు ఎవరి చేతుల్లోకైనా వెళ్లే ప్రమాదం ఉంటుందని టాటా గ్రూప్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 28వ తేదీ వరకు ఎస్పీ గ్రూప్, సైరస్ మిస్త్రీ, ఆయన పెట్టుబడి సంస్థలు టాటా సన్స్ షేర్లను తనఖా పెట్టడం లేదా బదలీ చేయడం వంటివి చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ తేదీ అయిన అక్టోబర్ 28వ తేదీ వరకు ఇప్పటికే తనఖా పెట్టిన షేర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని కూడా టాటా సన్స్, ఎస్పీ గ్రూప్లకు సూచించింది.