Vizag Steel plant..టాటా స్టీల్ చేతికి: కారణాలు తెలిపిన ఎండీ
విశాఖపట్నం: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ చేసిన ప్రకటన నేపథ్యంలో.. దాన్ని విక్రయించే దిశగా మరో కీలక ముందడుగు పడినట్టు కనిపిస్తోంది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేస్తోంది.
టాటా స్టీల్ ఆసక్తి..
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకం విషయంలో వెనుకంజ వేయట్లేదు.. రాజీధోరణిని ప్రదర్శించట్లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మరో తాజా సమాచారం వెలువడింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొనుగోలు చేయడానికి టాటా స్టీల్ (Tata Steel) ఆసక్తి కనపరుస్తోంది. విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL)ను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నామంటూ టాటా స్టీల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ (TV Narendran) తెలిపారు.
మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్..
అయిదు దశాబ్దాలకు పైగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటూ వస్తోన్న ఉక్కు కర్మాగారం ఇది. ప్రతి సంవత్సరం 7.3 మిలియన్ టన్నుల మేర ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఉంది. దేశంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో దశాబ్దాల కిందటే రాష్ట్రంలో ఉద్యమాలు సాగాయి. అలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్లాంట్ను ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు..
ఆర్థిక వ్యవహారాల మీద ఏర్పాటైన కేబినెట్ కమిటీ.. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వందశాతం మేర లో పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చంటూ సూచనప్రాయంగా తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలకు నివేదికలను అందజేసింది. కేబినెట్ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం- మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీలో సబ్సిడయిరీస్ లేదా జాయింట్ వెంచర్స్ ఉంటే వాటిని కూడా వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది.
టీవీ నరేంద్రన్ చెప్పిన కారణాలివే..
కాగా- వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపర్చడానికి టీవీ నరేంద్రన్ కారణాలను కూడా తెలియజేశారు. భౌగోళికంగా దక్షిణాదిన.. తీర ప్రాంతం కావడం, నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తోండటం, 22 వేల ఎకరాల్లో విస్తరించి ఉండటం వంటి కొన్ని ప్రధాన కారణాలు, వనరుల వల్ల వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు. ఇలాంటి అడ్వాంటేజ్ విశాఖ స్టీల్ ప్లాంట్కు చాలా ఉన్నాయని అంచనా వేస్తోన్నట్లు చెప్పుకొచ్చారు.
షోర్ బేస్డ్ ప్లాంట్..
విశాఖ స్టీల్ప్లాంట్కు సమీపంలోనే గంగవరం ఓడరేవు ఉండటం ఓ అడ్వాంటేజ్. ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడిసరుకులను తెప్పించుకోవడం సులభతరమౌతుంది. అదే సమయంలో ఇక్కడ తయారైన స్టీల్ను ఎగుమతి చేయడానికీ ఈ పోర్ట్ ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని టీవీ నరేంద్రన్ వ్యక్తం చేశారు. దీనితోపాటు- దక్షిణ, తూర్పు ఆసియా దేశాల మార్కెట్లకు ఉక్కును రవాణా చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు.
నీలాంచల్ కూడా..
వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు ఒడిశాలోని నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ను కూడా టేకోవర్ చేయాలని భావిస్తున్నట్లు టీవీ నరేంద్రన్ తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను దాఖలు చేస్తామని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కొనుగోలు చేయడానికి టాటా స్టీల్ ముందుకొచ్చిన నేపథ్యంలో- ఇక ఈ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ మరింత వేగవంతం కావడానికి అవకాశం ఉన్నట్టే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా తీసుకొచ్చిన రాజకీయపరమైన ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గనట్టే.