మళ్లీ టాటా చేతికి ఎయిరిండియా, మార్కెట్ షేర్ ఎంత: ప్రపంచంలో ఓల్డెస్ట్ ఎయిర్ లైన్స్ ఇవే
అప్పుల్లో కూరుకుపోయిన నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా బిడ్డింగ్ను టాటా సన్స్ గెలుచుకుంది. ఎయిర్ ఇండియాని దక్కించుకునేందుకు పలు సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. టాటా సన్స్ను విజయవంతమైన బిడ్డర్గా ఎంపిక చేసినట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. అయితే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం, టాటా సన్స్ స్పందించవలసి ఉంది.
ఎయిరిండియా నుండి కూడా ప్రకటన రావాల్సి ఉంది. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో ఎయిరిండియా బిడ్ ఆకర్షణీయంగా ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. విజయవంతమైన బిడ్డర్ పేరును దసరా నాటికి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ, స్పష్టత రావాల్సి ఉంది. ఎయిరిండియా 2007లో ఇండియన్ ఎయిర్ లైన్స్తో మెర్జ్ అయిన తర్వాత నుండి నష్టాల్లో ఉంది.
చెల్లింపులు ఎలా
బిడ్ మొత్తంలో ఎయిరిండియా రుణాలకు 85 శాతం, నగదుగా 15 శాతం బిడ్డర్స్ చెల్లించాలి. ఎయిరిండియా కోసం పలు సంస్థలు ఆర్థిక బిడ్స్ దాఖలు చేశాయి. స్పైస్ జెట్ అధినేత అజయ్ సింగ్ కూడా ఆర్థిక బిడ్ సమర్పించారు. ఎయిరిండియా నుండి ప్రభుత్వం వంద శాతం వాటాను ఉపసంహరించుకుంటోంది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్లోను వంద శాతం మొత్తాన్ని వదులుకుంటుంది.
గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ (AISATS) వాటాను 50 శాతం విక్రయిస్తోంది. బిడ్డింగ్ సందర్భంగా వేసిన కమిటీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలు ఉన్నారు.ఎయిరిండియా కొనుగోలు ద్వారా టాటాల చేతికి 4400 డొమెస్టిక్, 1800 ఇంటర్నేషనల్ ల్యాండింగ్స్ అండ్ పార్కింగ్ స్లాట్స్ అందుబాటులోకి వస్తాయి.
రిజర్వ్ ప్రైస్ ఎంతంటే?
ఎయిరిండియా రిజర్వ్ ప్రైస్ రూ.15,000 కోట్ల నుండి రూ.20,000 కోట్ల మధ్య ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవలే మినిమం రిజర్వ్ ప్రైస్ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. భవిష్యత్తులో క్యాష్ ఫ్లో అంచనాలు, బ్రాండ్ వ్యాల్యూ, విదేశీ విమానాశ్రయాల్లో స్లాట్స్ ఆధారంగా రిజర్వ్ ప్రైస్ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. టాటా సన్స్ బిడ్ వ్యాల్యూ రిజర్వ్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉన్నదని తెలుస్తోంది. విమానయాన రంగంలో అనుభవం కలిగిన టాటా సన్స్కు మాత్రమే ఎయిరిండియా పునరుద్ధరణకు కావాల్సిన నిధులను సమీకరించే సామర్థ్యం ఉందని భావిస్తున్నారు.
ప్రారంభించింది టాటాలు..
90 సంవత్సరాల క్రితం 1932లో ఎయిరిండియాను టాటా ఎయిర్ లైన్స్ పేరుతో టాటా గ్రూప్ ప్రారంభించింది. 1953లో జాతీయీకరణ నేపథ్యంలో ప్రభుత్వం పరమైంది. ఆ తర్వాత 1977 వరకు నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు 68 ఏళ్ల తర్వాత తిరిగి మళ్లీ టాటాల చేతికే వెళ్తోంది. డిసెంబర్ నాటికి ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయి, టాటా సన్స్ చేతికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎయిరిండియా మార్కెట్ షేర్
ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ కలిపి ఆగస్ట్ డొమెస్టిక్ మార్కెట్ షేర్ 13.20 శాతంగా ఉంది. డెయిలీ డొమెస్టిక్ ఫ్లైట్స్ 180 నుండి 185 వరకు. కరోనాకు ముందు 200 కంటే ఎక్కువగా ఉన్నాయి. కరోనాకు ముందు 85 డొమెస్టిక్ డెస్టినేషన్స్కు కార్యకలాపాలు నిర్వహించింది. అలాగే 40 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ ఉన్నాయి. 15,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
దేశంలో, అంతర్జాతీయంగా ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ పాసింజర్ ఫ్లైయింగ్ మార్కెట్ షేర్ 18.8 శాతంగా ఉంది. ఈ రెండు కలిపితే అతిపెద్ద వాటా ఎయిరిండియాదే. దేశీయ సంస్థల అంతర్జాతీయ మార్కెట్ షేర్ 39.2 శాతంగా ఉండగా, ఇందులో ఇండిగో 12.8 శాతం, ఎయిరిండియా 11.5 శాతం, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 7.3 శాతం, స్పైస్ జెట్ 5 శాతం, గోఎయిర్ 2.6 శాతంగా ఉంది.
ప్రపంచంలో ఓల్టెస్ట్ ఎయిర్ లైన్స్
టాటా ఎయిర్ లైన్స్ పేరుతో టాటా గ్రూప్ ప్రారంభించినప్పటికీ, ఆ తర్వాత జాతీయీకరణలో భాగంగా ఎయిరిండియాగా మారిన ఈ విమానయాన సంస్థ 1932లో ప్రారంభమైంది. టాటా ఎయిర్ లైన్స్ తన మొదటి విమానాన్ని కరాచీలోని డ్రిగ్ రోడ్ ఏరోడ్రమ్ నుండి ముంబైకిలోని జూహు ఎయిర్స్ట్రిప్కు నడిపింది. దీనిని అహ్మదాబాద్గా నడిపింది. టాటా ఎయిర్ లైన్స్ లేదా ప్రస్తుత ఎయిరిండియా పుట్టి 90 ఏళ్ళు అవుతుంది.
దీని కంటే ముందు మరిన్ని ఎయిర్ లైన్స్ కూడా ఉన్నాయి. అందలో 1919లో నెదర్లాండ్స్లో కేఎల్ఎం ఎయిర్ లైన్స్, 1919 డిసెంబర్లో కొలంబియాకు చెందిన అవియాంకా, 1920లో ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్, 1923లో చెక్ రిపబ్లిక్లో చెక్ ఎయిర్ లైన్స్, 1923లో ఫిన్లాండ్కు చెందిన ఫిన్-ఎయిర్, 1924లో యూఎస్లో డెల్టా, 1927లో సెర్బియాకు చెందిన ఎయిర్ సెర్బియా, 1927లోనే స్పెయిన్కు చెందిన లిబెరియా అత్యంత పురాతన ఎయిర్ లైన్స్. ఎయిరిండియా(పాత పేరు టాటా ఎయిర్ లైన్స్) 1932లో ప్రారంభమైంది.
ఏ సంస్థ ఎప్పుడు?
- ఎయిరిండియాను టాటా గ్రూప్ 1932లో ప్రారంభించింది. 1953లో జాతీయీకరణ చేశారు. ఇప్పుడు మళ్లీ టాటా సన్స్ చేతికి వస్తోంది.
- స్పైస్ జెట్ 1993లో ప్రారంభమైంది. 1996లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత అజయ్ సింగ్ దీనిని 2005లో కొనుగోలు చేశారు. యూకే ఎన్నారో భులో కన్సగ్రాతో కలిసి కొనుగోలు చేశారు. కన్సగ్రా 2008లో తన వాటాను యూఎస్ డిస్ట్రెస్ ఇన్వెస్టర్ విబూర్ రాస్కు విక్రయించారు. రెండేళ్ల తర్వాత రాస్, అజయ్ సింగ్లు తమ వాటాను సన్ గ్రూప్కు చెందిన కళానిధి మారన్కు విక్రయించారు. 2015లో మారన్ తన వాటాను తిరిగి అజయ్ సింగ్కు విక్రయించారు.
- జెట్ ఎయిర్వేస్ను నరేష్ గోయల్ 1992లో ప్రారంభించారు. 26 ఏళ్ల తర్వాత 2019 ఏప్రిల్ నెలలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇది వచ్చే ఏడాది మార్చి నెలలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది.