ముంబై: ముడి సరుకు వ్యయాలు పెరిగినందున వచ్చే నెల నుండి ధరలు పెంచాలని వివిధ వాహన సంస్థలు నిర్ణయించాయి. దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇసుజు మోటార్స్, బీఎండబ్ల్యు మోటార్స్ వెల్లడించాయి. జనవరి 1వ తేదీ నుండి ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్, ఇసుజు మోటార్స్ ఇండియా వెల్లడించగా, జనవరి 4వ తేదీ నుండి ధరలు పెంచుతున్నట్లు బీఎండబ్ల్యు తెలిపింది. ఇసుజు మోటార్స్ కూడా జనవరి నుండి వాహన ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.

టాటా మోటార్స్ వాహనాల ధరల పెంపు
జనవరి 1వ తేదీ నుండి కమర్షియల్ వెహికిల్ మోడల్స్ ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. మోడల్ను బట్టి ఈ పెంపు ఉంటుందని తెలిపింది. ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించిన నేపథ్యంలో నేడు ప్రారంభంలో ఈ కంపెనీ స్టాక్స్ 3 శాతం మేర నష్టాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత పుంజుకొని 0.30 శాతం లాభంతో ముగిశాయి. M&HCV, I&LCV, SCV & బస్సులు.. అన్ని పోర్ట్ పోలియోల్లో ధరలు పెంచుతున్నట్లు తెలిపింది.

మహీంద్రా ట్రాక్టర్స్ ధరల పెంపు
జనవరి 1వ తేదీ నుండి మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ కొనుగోలు చేయాలంటే మరింత వెచ్చించాల్సి ఉంటుంది. ఉత్పాదక వ్యయం పెరుగడంతో వచ్చే నెల 1 నుంచి ట్రాక్టర్ల ధరలను పెంచుతున్నట్లు సోమవారం M&M ప్రకటించింది. ఈ మేరకు బీఎస్ఈకి సమాచారం అందించింది. కమోడిటీ ధరలు, ఉత్పాదక వ్యయం అధికమవడంతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఇసుజు, బీఎండబ్ల్యు కూడా..
డీమ్యాక్స్ రెగ్యులర్ క్యాప్, డీమ్యాక్స్ ఎస్ క్యాబ్ శ్రేణి మోడల్స్ ధరలను జనవరి 1వ తేదీ నుండి ఎక్స్ షోరూంపై రూ.10వేల వరకు పెంచుతున్నట్లు ఇసుజు ఇండియా తెలిపింది. ప్రస్తుతం డీమాక్స్ రెగ్యులర్ క్యాబ్ ధరలు రూ.8.64 కోట్లు, డీమ్యాక్స్ ఎస్ క్యాబ్ ధరలు రూ.10.62 లక్షల నుండి (ఎక్స్ షోరూం ముంబై) ప్రారంభమవుతున్నాయి.
అన్ని పోర్ట్పోలియో వాహనాలపై 2 శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు బీఎండబ్ల్యు తెలిపింది. జనవరి 4వ తేదీ నుండి ఈ పెంపు అమలవుతుందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications