Tata Group: బిస్లరీ వాటర్ పై టాటాల కన్ను.. ఉరకలేస్తూ పెరిగిన టాటా కంపెనీ షేర్.. పూర్తి వివరాలు..
Tata Group: టాటా గ్రూప్ ఏదైనా కంపెనీని కొనుగోలు చేస్తుందంటే దాని వెనుక సరైన వ్యాపార ప్రణాళిక ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే గతంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను, ఫోర్డ్ మోటార్ తయారీ యూనిట్లను కొన్న టాటాలు తాజాగా మరో కంపెనీలో కీలక వాటాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్టర్ల ఈ డీల్ పైనే పడింది.
టాటాల ఆఫర్..
రతన్ టాటా ఆధీనంలోని టాటా గ్రూప్ ఇప్పుడు తాగునీటి పరిశ్రమలో టాటా వాటర్, హిమాలయన్ వాటర్ వంటి బ్రాండ్లను కలిగి ఉంది. అయితే ఈ రంగంలో అతిపెద్ద కంపెనీగా ఉన్న బిస్లరీ ఇంటర్నేషనల్లో వాటాను కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. దేశంలోని అతిపెద్ద ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీ రమేష్ చౌహాన్ యాజమాన్యంలోని బిస్లెరీ ఇంటర్నేషనల్లో వాటా కోసం టాటా ఆఫర్ చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ ఒక వార్తా కథనంలో తెలిపింది.
నిపుణులు ఏమంటున్నారు?
టాటా గ్రూప్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వ్యాపారం గురించి ఉత్సాహంగా ఉంది. ఇందులో భాగంగానే కంపెనీలో వాటాను కొనుగోలు చేయడానికి బిస్లరీకి ఆఫర్ చేసింది. ఇది టాటా ఎంట్రీ లెవల్, మిడ్-సెగ్మెంట్, ప్రీమియం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కేటగిరీలో భారీ పట్టు సాధించడంలో సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మార్కెటింగ్ సౌలభ్యం..
ఇది మాత్రమే కాకుండా.. ఈ డీల్ ద్వారా రిటైల్ దుకాణాలు, కెమిస్ట్ ఛానెల్లు, సంస్థాగత ఛానెల్లు, హోటళ్లతో సహా టాటా రెడీ-టు-మార్కెట్ నెట్వర్క్ పెరుగుతుంది. రెస్టారెంట్లు, విమానాశ్రయాలతో పాటు బిస్లరీ మినరల్ వాటర్ బల్క్-వాటర్ డెలివరీలో అగ్రగామిగా ఉంది. ప్రస్తుత డీల్ ద్వారా అపార అవకాశాలను వినియోగించుకుని వినియోగదారులకు మరింత దగ్గర కావటానికి టాటాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
డీల్ వల్ల లాభపడే స్టాక్ ఇదే..
ప్రస్తుతం టాటాలు బిస్లరీలో వాటాలు కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలు టాటా బివరేజెస్ హెడ్ అయిన టాటా కన్జూమర్ కంపెనీ షేర్లను భారీగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం టాటా కన్జూమర్ దేశంలో అతిపెద్దదిగా ఉంది. దీనికింద కంపెనీ స్టార్బక్స్ కేఫ్స్, టెట్లీ టీ, ఎయిటో క్లాక్ కాఫీ, టాటా సోల్ ఫుల్, టాటా సాల్ట్, హిమాలయ వాటర్, పప్పు ధాన్యాలను విక్రయిస్తోంది. ఇప్పుడు బిస్లరీని కొనుగోలు చేయడం ద్వారా కంపెనీ తన వ్యాపారాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఈ నిర్ణయం వెలువడటంతో ఉదయం 11.13 గంటలకు స్టాక్ రూ.10.55 పెరిగి రూ.827 వద్ద ట్రేడ్ అవుతోంది.
బిస్లరీ నెట్వర్క్..
ప్రస్తుతం బిస్లరీకి భారతదేశం అంతటా 122 తయారీ ప్లాంట్లు ఉన్నాయి. కంపెనీకి దాదాపుగా 5,000 ట్రక్కులతో పాటు 4,500 పైగా పంపిణీదారుల నెట్వర్క్ ఉంది. బిస్లరీ మినరల్ వాటర్, వేదికా హిమాలయన్ స్పింగ్ వాటర్, ఫిజీ డ్రింక్స్, హ్యాండ్ ఫ్యూరిఫయర్లను విక్రయిస్తోంది. కంపెనీ ప్రస్తుతం దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం తన నీటి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.