TCSలో 40,000 ఉద్యోగాలు! ఉద్యోగుల సంఖ్యలో త్వరలో సరికొత్త రికార్డ్
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) 2021-22 ఆర్థిక సంవత్సరంలో 40,000 మందిని కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోనుంది. గత ఏడాది కూడా దాదాపు ఇంతేమందిని తీసుకున్నది. వచ్చే ఏడాది కూడా దాదాపు అదే సంఖ్యలో లేదా అంతకుమించి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. టీసీఎస్ రెండు రోజుల క్రితం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. మరుసటి రోజు ఈ నియామకాలకు సంబంధించి వెల్లడించింది.
టీసీఎస్ రానున్న మూడు నెలల్లో 5 లక్షల ఉద్యోగుల కలిగిన సంస్థగా కూడా రికార్డులకు ఎక్కనుంది. అప్పుడు దేశంలో ఈ ఘనత సాధించనున్న తొలి ఐటీ సంస్థగా టీసీఎస్ నిలుస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తి నాటికి ఆ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 4,88,649. గత సంవత్సరంలో 40,185 మంది ఉద్యోగులు కొత్తగా చేరారు.
జనవరి-మార్చి 2021 కాలంలోనే 19,388 మంది ఉద్యోగులు కొత్తగా చేరారు. ఈ త్రైమాసికంలో రికార్డ్ స్థాయిలో 9.2 బిలియన్ డాలర్ల ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ దేశీయ ఐటీ దిగ్గజం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను 40వేల మందిని చేర్చుకునే ప్రణాళికలు వేస్తోంది. వచ్చే ఒకటి రెండు త్రైమాసికాల్లోనే ఎక్కువమందిని చేర్చుకోనుంది. 12వేల మంది ఉద్యోగులు చేరితే టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 5 లక్షలు దాటుతుంది.