టారిఫ్ ఎఫెక్ట్: దూసుకెళ్తున్న ఎయిర్టెల్, ఐడియా షేర్లు, రిలయన్స్ జోరు
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. నేడు (డిసెంబర్ 2) ఉదయం గం.9.19 నిమిషాలకు సెన్సెక్స్ 66.45 పాయింట్ల (0.16 శాతం) లాభంతో 40,860.26 పాయింట్ల వద్ద, నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 12,070 వద్ద ప్రారంభమైంది. 428కి పైగా షేర్లు లాభాల్లో, 243 షేర్లు నష్టాల్లో ట్రేడ్ కాగా, 72 షేర్లలో మార్పు లేదు. మధ్యాహ్నం గం.11.20 నిమిషాలకు సెన్సెక్స్ 40,810.46 వద్ద, నిఫ్టీ 12,050.80 వద్ద ట్రేడ్ అయింది.
ముఖ్యంగా టారిఫ్స్ పెంచుతున్నట్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ప్రకటించడంతో టెలికం షేర్లు దూసుకెళ్తున్నాయి. రిలయన్స్ షేర్లు ఓ దశలో రూ.1,600 మార్కును దాటి రూ.1,608.50 వద్ద ట్రేడ్ అయింది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లు 18 శాతానికి పైగా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
మధ్యాహ్నం సమయానికి ఎయిర్ టెల్ 7.39 శాతం లాభపడి రూ.475.15, వొడాఫోన్ ఐడియా షేర్ ధర 21.17 శాతం పెరిగి రూ.8.30 వద్ద, రిలయన్స్ షేర్ 2.37 శాతం పెరిగి రూ.1,587 వద్ద ట్రేడ్ అయింది.
టెలికం కంపెనీలతో పాటు ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మిడ్ క్యాప్ సూచీ, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. పెట్టుబడుల రూపంలో 2 బిలియన్ డాలర్లు వస్తున్నట్లు యస్ బ్యాంకు ప్రకటించింది. దీంతో ఉదయం ట్రేడింగ్లో యస్ బ్యాంకు షేర్ నష్టపోయింది.