ఐపీఓకు రానున్న 100 ఏళ్ల చరిత్ర ఉన్న బ్యాంక్: సెబి గ్రీన్ సిగ్నల్
ముంబై: స్టాక్ ఎక్స్ఛేంజీల్లో బ్యాంకింగ్ సెగ్మెంట్ సంఖ్య మరింత పెరగనుంది. మరో ప్రైవేట్ బ్యాంక్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ను జారీ చేయనుంది. దీనికి సంబంధించి సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ అనుమతులను సైతం పొందింది ఈ బ్యాంక్. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రారంభంలో పబ్లిక్ ఇష్యూను జారీ చేయడానికి సన్నాహకాలు చేయొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
అదే- తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్. తమిళనాడులోని తూత్తుకుడి ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా శాఖా కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ బ్యాంక్ ఇది. తాజాగా పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది. ఇదివరకే బ్యాంక్ యాజమాన్యం- సెబికి తన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్ను సమర్పిచింది. దీనికి సెబి నుంచి తాజాగా ఆమోదం లభించింది.
1,58,27,495 ఫ్రెష్ ఈక్విటీ షేర్స్ను జారీ చేయనుంది. దీనితోపాటు ఆఫర్ ఫర్ సేల్ కింద మరో 12,505 ఈక్విటీ షేర్ల ద్వారా ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను సమీకరించుకోనుంది. బ్యాంక్ ప్రమోటర్లు డీ ప్రేమ్ పళనివేల్, ప్రియా రాజన్, ప్రభాకర్ మహదేవ్, నరసింహన్ కృష్ణమూర్తి, ఎం మల్లిగ రాణి, సుబ్రమణియన్ వెంకటేశ్వరన్ అయ్యర్ వాటాల షేర్లు ఇందులో ఉన్నాయి.
ఐపీఓను జారీ చేయడానికి అనుమతు మంజూరు చేయాలంటూ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మేనేజ్మెంట్.. గత ఏడాది సెప్టెంబర్లో సెబికి డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్ను అందజేసింది. వాటన్నింటినీ పరిశీలించిన తరువాత సెబి తాజాగా తన ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తాన్ని టయర్-1 కేపిటల్ బేస్, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికల కోసం వినియోగిస్తామని వివరించింది.
దేశంలో వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న బ్యాంకుల్లో తమిళనాడు మర్కంటైల్ కూడా ఒకటి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అగ్రికల్చర్, రిటైల్ కస్టమర్లకు రుణాలను మంజూరు చేసే సెగ్మెంట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా 509 శాఖా కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో 106 గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి.
247 బ్రాంచీలు సెమీ అర్బన్, 80, అర్బన్, 76 మెట్రోపాలిటన్ సిటీల్లో ఉన్నాయి. 4.93 మిలియన్ల ఖాతాదారులు ఈ బ్యాంక్కు ఉన్నారు. అయిదు సంవత్సరాలకు పైగా బ్యాంక్తో అసోసియేట్ అయివున్న ఖాతాదారుల సంఖ్య 70 శాతానికి పైగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.