ఫుడ్ డెలివరీ లోకి అమెజాన్... బెంగళూరులో పైలట్ ప్రారంభం!
ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్... ఇకపై ఇండియాలో ఫుడ్ డెలివరీ కూడా చేయబోతోంది. ఈ దిశగా ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్న ఈ కంపెనీ ఐటీ రాజధాని బెంగళూరులో తొలుత ఒక పైలట్ ప్రాజెక్ట్ ను చేపడుతోంది. ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గి, జొమాటో లు స్థిరపడ్డాయి. కానీ ఈ రంగంలో విపరీతమైన పోటీ నెలకొనటంతో ఇప్పటి వరకు అవి ఒక్క రూపాయి లాభాన్ని కూడా ఆర్జించలేదు.
పైగా రూ వేల కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ పోటీని తట్టుకోలేక ఉబెర్ తన ఫుడ్ డెలివరీ బిజినెస్ విభాగం ఐన ఉబెర్ ఈట్స్ ను జొమాటో కు విక్రయించి ఈ రంగం నుంచి పూర్తిగా నిష్క్రమించింది. కానీ పెట్టుబడికి కొదవలేని అమెజాన్ మాత్రం ఎలాగైనా ఫుడ్ డెలివరీ రంగంలో పట్టు సాధించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇప్పటికే రెండు గంటల్లోనే సరుకులను డెలివరీ చేసే అమెజాన్ నౌ ని పటిష్టం చేసిన అమెజాన్... ఇక ఫుడ్ డెలివరీ పై కన్నేసిందని చెబుతున్నారు.
ఎప్పుడొచ్చామనేది కాదు...
ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఆలస్యంగా వస్తున్నా.. అందులో స్థిరపడగలమనే ధృఢనిశ్చయంతో అమెజాన్ కనిపిస్తోంది. తమ ప్రీమియం కస్టమర్లు అయిన అమెజాన్ ప్రైమ్ కస్టమర్ల కు అన్నిరకాల సేవలు అందించేందుకు అమెజాన్ ఇలా విభిన్న పోర్టుఫోలియోలను ఆశ్రయిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే, ఈ రంగంలోకి ఎప్పుడొచ్చామనేది అసలు సమస్యే కాదని, లేటుగా వచ్చినా గెలవొచ్చు అనేది అమెజాన్ లక్ష్యంగా కనిపిస్తోందని ఒక అనలిస్ట్ పేర్కొనటం విశేషం. టెక్నాలజీ మొబైల్ యాప్స్ అత్యధిక వేగంగా ట్రాక్షన్ (ఎక్కువ మంది ఆర్డర్ చేసేది) నమోదు అయ్యేది ఫుడ్ మాత్రమే. ఆ తర్వాతే గ్రోసరీస్, ఎఫ్ ఎం సి జి, చివరన ఈ-కామర్స్ ప్రోడక్టులు ఉంటాయి. అందుకే, అమెజాన్ ఈ అన్ని రంగాల్లోనూ తన ఆధిపత్యం ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సొంత ఉద్యోగులకు డెలివరీ..
బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన అమెజాన్... తొలుత తన సొంత ఉద్యోగులకు ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తోంది. తద్వారా ఈ రంగంలో సాధకబాధకాలు అంచనా వేసి ఇక పూర్తిస్థాయిలో రంగప్రవేశం చేయనుందని తెలిసింది. ఇందులో భాగంగా బెంగళూరులోని మరతహళ్లి, వైట్ ఫీల్డ్, హెచ్ ఎస్ ఆర్, బెల్లందురు, హారాలూరు వంటి ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ చేస్తోంది. ఇందుకోసం రెండు రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. కాగా, అమెజాన్ ఫుడ్ డెలివరీ కోసం హోటల్స్, రెస్టారెంట్లను ప్లాట్ఫారం పైకి తెచ్చేందుకు ప్రయోన్ బిజినెస్ సర్వీసెస్ అనే కంపెనీ పనిచేయనుంది. ఇది ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కి చెందిన పెట్టుబడి సంస్థ కాటమరాన్, అమెజాన్ ఇండియా ల జాయింట్ వెంచర్ కంపెనీ కావటం మరో విశేషేశం.
స్విగ్గి, జొమాటోలకు చుక్కలే..
ఫుడ్ డెలివరీ లో కీలకపాత్ర పోషించేది హోటల్స్, రెస్టారెంటులే. ప్రస్తుతం స్విగ్గి, జొమాటో లు వాటి నుంచి సగటున 25% కమిషన్ వసూలు చేస్తున్నాయి. కానీ అమెజాన్ కేవలం 10% నుంచి 15% మాత్రమే కమిషన్ వసూలు చేయనుందని తెలిసింది. అంటే దాదాపు సగం కమిషన్ మాత్రమే కాబట్టి, రెస్టారెంట్లు అమెజాన్ ఫుడ్ డెలివరీ పై ఆసక్తి కనబరచవచ్చు. అలాగే, నష్టాలను పూడ్చుకునేందుకు స్విగ్గి, జొమాటోలు ఇటీవల భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను తగ్గించేశాయి. దాంతో వాటికి ఆర్డర్లు కూడా తగ్గుతున్నట్లు అంచనాలున్నాయి. మరో వైపు కొత్త పెట్టుబడి రాబట్టేందుకు చాలా కష్టపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ నిధులు ఉన్న అమెజాన్ తో పోటీ పడాలంటే స్విగ్గి, జొమాటో లు మరింత చెమటోడ్చాల్సిందే. వచ్చే నెలలో అధికారికంగా అమెజాన్ ఫుడ్ డెలివరీ ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. దానికి రఘు లక్కప్రగతి నాయకత్వం వహిస్తున్నారు. అయన జెఎంటీయూ లో ఇంజనీరింగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ప్రొఫెషనల్ కోర్స్ చేసారు.