Swiggy Delivery: భారీ వర్షంలో గుర్రంపై ఆర్డర్లు డెలివరీ.. స్విగ్గీ డెలివరీ ఏజెంట్ చేసిన పని వైరల్..
Food Delivery On Horse: ఒకప్పుడు రాజులు అశ్వాలను వినియోగించి ఒక చోటు నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణాలు చేసేవారు. ఇప్పటి తరం వారు చాలా మంది దానిని చూడకపోయినప్పటికీ సినిమాల్లో హీరోలు చేసే కొన్ని పాత్రల్లో గుర్రాల వినియోగాన్ని చూస్తుంటాం. కానీ.. ముంబైలో భారీ వర్షాల మధ్య ఒక స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ఆర్డర్లను డెలివరీ చేయడానికి గుర్రాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
|
రోడ్లు నీటిలో నిండిపోవటంతో..
ముంబై మహానగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు నీటితో నిండిపోవడంతో డెలివరీ చేసే వ్యక్తి ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేసేందుకు గుర్రంపై ప్రయాణిస్తున్నట్లు వీడియోలో చిత్రీకరించారు. అనేక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో దీనికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ షేర్ చేయబడిన తర్వాత ప్రత్యేకమైన ఈ డెలివరీ వెలుగులోకి వచ్చింది.
పెట్రోల్ ధరల వల్లేనా అంటూ..
కేవలం కొన్ని గంటల్లోనే ఈ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేసింది. చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు డెలివరీ వ్యక్తి అంకితభావాన్ని ప్రశంసించారు. ఒక వినియోగదారు సరదాగా ఇలా వ్రాశాడు, "ఇప్పుడు నేను దీనిని 'షాహీ డెలివరీ' అని పిలుస్తాను". మరొకరు, "అతను పిజ్జా డెలివరీ చేయడం లేదని నేను ఆశిస్తున్నాను" అని అన్నాడు. మరొక వ్యక్తి "అతను తన వాహనాన్ని ఎక్కడ పార్క్ చేస్తాడో అని నేను ఆశ్చర్యపోతున్నాను! #Swiggy 🐎 పెట్రోల్ ధరల పెంపు వల్ల ఇలా జరిగిందా?" అని కామెంట్ల వర్షం కురుస్తోంది.
ఆలస్యంగా రైలు సేవలు..
ఈ వారం ప్రారంభంలో ముంబైని భారీ వర్షాలు తాకాయి, నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య, కల్బాదేవి, సియోన్ ప్రాంతాల్లో రెండు భవనం కూలిన సంఘటనలు నమోదయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మరికొన్ని భవనాల నుంచి ప్రజలను సురక్షితంగా తరలించారు. వర్షపాతం కారణంగా వరద నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు చెందిన 12 బస్సు రూట్లను అధికారులు మాచ్చారు. అంతేకాకుండా.. భారీ వర్షాల కారణంగా రైలు సేవలు ఐదు నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా ఉన్నాయని కొందరు రైల్వే ప్రయాణికులు పేర్కొన్నారు.