కోట్ల ఆస్తిని కాదనుకున్న చిన్నారి.. సన్యాసినిగా వజ్రాల వ్యాపారి కూతురు.. పూర్తి వివరాలు
Devanshi Sanghvi: వజ్రాల వ్యాపారి అనగానే మనకు గుర్తుకొచ్చేంది ముందుగా కోట్లు విలువైన ఆస్తులు, విలాసవంతమైన జీవితం. అయితే వీటన్నింటినీ వదులుకోవటం అంత ఈజీ కాదు.ఈ వయస్సులో అందరూ తోటి పిల్లలతో ఆడుకోవటం, టీవీ చూడటం, సరదాగా గడపటం చేస్తుంటారు. కానీ సూరత్ కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి 9 ఏళ్ల గారాలపట్టి ఈ విలాసాలను, సంపదను వదులుకుని సన్యాసినిగా మారింది. అయితే దేవాన్షి సంఘ్యీ తీసుకున్న ఈ నిర్ణయం గురించి విన్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.
దేవాన్షి కుటుంబం..
సన్యాసినిగా మారిన చిన్నారి దేవాన్షి తండ్రి ఒక వజ్రాల వ్యాపారి. పైగా వందల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. ఆమె తండ్రి ధనేష్ సింఘ్వీ ప్రపంచంలోనే అత్యంత పురాతన వజ్రాల కంపెనీకి యజమాని. ఆయన శాంఘ్వీ & సన్స్ కంపెనీ వ్యవస్థాపకుడు మహేశ్ సింఘ్వీకి ఏకైక కుమారుడు. వీరి వ్యాపార బ్రాంచ్ లు దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు ఇతర దేశాల్లోనూ విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం సన్యాసినిగా మారిన దేవాన్షి ఆయన పెద్ద కుమార్తె. అయితే ఇకపై ఆమె కోట్ల రూపాయల వ్యాపారాన్ని, ఆస్తులను వద్దనుకుని సాధారణ జీవితం గడపనుంది.
తెలివైన దేవాన్షి..
జైన మతానికి చెందిన దేవాన్షి మత విద్యలో మంచి ప్రతిభ కనబరిచింది. వారు నిర్వహించే క్విజ్ పోటీలో బంగారు పతకాన్ని సైతం సాధించింది. ఆమె హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, గుజరాతీతో పాటు జర్వాడీలో మంచి పాండిత్యాన్ని సంపాదించింది. వీటికి తోడు సంగీతం, యోగా, భరతనాట్యం కూడా నేర్చుకుంటోంది. అయితే ఇప్పటి వరకు ఆమె టీవీ చూడలేదని దేవాన్షి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
దీక్ష పుచ్చుకుని..
దేవాన్షి దీక్ష జనవరి 14వ తేదీ నుంచే ప్రారంభమైంది. గత బుధవారం నాడు 35,000 మంది సమక్షంలో జైనమత దీక్షను ఈ చిన్నారి స్వీకరించింది. దీనికోసం సాధారణ దుస్తులు ధరించి నాలుగు ఏనుగులు, 11 ఒంటెలు, 20 గుర్రాలతో భారీ సమూహంగా తన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించింది. కేవలం 9 ఏళ్ల వయస్సులో 357 రోజుల పాటు దీక్ష చేసింది. పైగా కాలినడకన 500 కిలోమీటర్లు ప్రయాణించి జైనమత ఆచారాలలో పాలుపంచుకుంది.
వజ్రాల వ్యాపారం..
దేవాన్షి తాతగారు మోహన్ భాయ్ సింఘ్వీ 1981లో డైమండ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. సింఘ్వి & సన్స్ డైమండ్ పేరుతో కంపెనీని ముందుకు నడిపించారు. ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA ప్రకారం ఈ కంపెనీ విలువ కోట్లలో ఉంటుంది. 2001లో కంపెనీ ఆపరేటింగ్ వ్యాపారం రూ.300.1 కోట్లుగా ఉంది. 2021 ఆర్ఖిక ఫలితాలను గమనిస్తే కంపెనీ ఆదాయం రూ.304.4 కోట్లుగా ఉంది. తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న చిన్నారి వీటన్నింటినీ వదులుకుని ముందుకు సాగటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.