లోన్ మారటోరియం కేసు: కేంద్రం, ఆర్బీఐకు సుప్రీం చివరి అవకాశం
ఢిల్లీ: లోన్ మారటోరియం కేసులో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి సుప్రీం కోర్టు చివరి అవకాశం ఇచ్చింది. రెండు వారాల్లో సమగ్ర అఫిడవిడ్ దాఖలు చేయాలని ఆదేశాలు జారి చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు, కంపెనీల చేతుల్లో డబ్బులు లేకపోవడంతో ఈఎంఐ చెల్లింపులపై ఆగస్ట్ 31వ తేదీ వరకు వెసులుబాటు కల్పించారు. అయితే దీనిపై వడ్డీ, వడ్డీ మీద వడ్డీ అంశం సుప్రీంకు వెళ్లింది. రుణగ్రహీతల పై పడే భారాన్ని తగ్గించే విధంగా ఓ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఇదే చివరి అవకాశమని ఇకపై కేసు విచారణను వాయిదా వేయమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం విచారణను ఈ 28వ తేదీకి వాయిదా వేసింది.
లోన్ మారటోరియానికి సంబంధించి రుణగ్రహీతలకు సుప్రీంకోర్టులో ఇటీవల ఊరట దక్కిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 31వ తేదీలోపు ఎన్పీఏలుగా ప్రకటించని అకౌంట్స్ను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు నిరర్థక ఆస్తులుగా ప్రకటించవద్దని బ్యాంకులకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. రుణమారటోరయం కాలానికిగాను వడ్డీలపై వడ్డీ విధించడాన్ని సవాల్ చేస్తూ జారీ చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సాగుతోంది.
'టార్గెట్'ను చేధించిన రిలయన్స్, షేర్ రికార్డ్: రూ.15 లక్షల కోట్లతో సరికొత్త రికార్డ్
లోన్ మారటోరియంకు సంబంధించి కేంద్రం కూడా ఇటీవల తన వైఖరి వెల్లడించిన విషయం తెలిసిందే. మారటోరియం కాలాన్ని రెండేళ్లపాటు పొడిగించే అవకాశముందని కేంద్రం తరుఫున అటర్నీ జనరల్ గతవారం తెలిపారు. అయితే తర్వాత విచారణలో బ్యాంకులకు నష్టం కలిగించే నిర్ణయం కేంద్రం తీసుకోబోదని తెలిపింది. వడ్డీపై వడ్డీ అంశంలో కేంద్రం ఏం చేయనుందో కేంద్రం చెప్పాల్సి ఉంది. దీనిపై స్పష్టత ఇవ్వాలని సుప్రీం.. కేంద్రానికి సూచించింది.