నొయిడా ట్విన్ టవర్ల కూల్చివేతపై సూపర్టెక్ కొత్త డెసిషన్
న్యూఢిల్లీ: నొయిడాలో 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చివేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై.. దాన్ని నిర్మించిన రియల్ ఎస్టేట్ ఫర్మ్ సూపర్టెక్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. భవన నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన నియమ, నిబంధనలన్నింటినీ ఉల్లంఘించారనే కారణంతో దాన్ని కూల్చివేయాల్సిందిగా ఇదివరకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మూడు నెలల్లో దాన్ని కూల్చివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది.
దీనిపై అప్పీల్కు వెళ్లాలని సూపర్టెక్ తాజాగా నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటీషన్ను దాఖలు చేయనున్నట్లు సూపర్టెక్ ఛైర్మన్ ఏకే అరోరా తెలిపారు. ట్విన్ టవర్స్ నిర్మాణంలో ఎక్కడా కూడా నిబంధనల ఉల్లంగన చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు, ఇతర సాక్ష్యాలను సుప్రీంకోర్టుకు అందజేస్తామని చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో రివ్యూ పిటీషన్ను దాఖలు చేస్తామని అన్నారు.
దీనికి సంబంధించిన న్యాయ ప్రక్రియను చేపట్టామని, న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఏకే అరోరా తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు, ఆదేశాల ప్రభావం.. తమ రియల్ ఎస్టేట్ కంపెనీ మీద పెద్దగా దుష్ప్రభావం చూపబోదనే ఆశిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తాము పూర్తిగా గౌరవిస్తున్నామని, బిల్డింగ్ బైలాస్ ప్రకారమే తాము ట్విన్ టవర్లు అపెక్స్ అండ్ సెయానెను నిర్మించామని ఆయన పునరుద్ఘాటించారు.
నొయిడాలో ఉన్న ఈ ట్విన్ టవర్స్లో సుమారు వెయ్యి ప్లాట్లు ఉన్నాయి. అవన్నీ అమ్ముడుపోయాయి. ఇప్పుడు వాటిని కూల్చేయడం వల్ల ప్లాట్ల కొనుగోలుదారులకు ఎలాంటి నష్టాన్ని వాటిల్లకుండా ఉండేలా సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసిన విషయం తెలిసిందే. ప్లాట్ల కొనుగోలుదారులు ఒక్కొక్కరికి 12 శాతం వడ్డీతో వారు ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు.. సూపర్టెక్ కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. తాజాగా- తాము రివ్యూ పిటీషన్ దాఖలు చేస్తామని ఆ కంపెనీ చైర్మన్ ఏకే అరోరా తెలిపారు.
నొయిడాలోని సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్టెక్ లిమిటెడ్ ఈ ట్విన్ టవర్లను నిర్మించింది. 2009లో వాటి నిర్మాణాన్ని చేపట్టింది. బిల్డింగ్ ప్లాన్ల విషయంలో సెక్టార్ 93 రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో సూపర్టెక్ మేనేజ్మెంట్ విభేదించింది. రెసిడెన్షియల్ బైలాస్కు వ్యతిరేకంగా టవర్ల నిర్మాణాన్ని పూనుకున్నట్లు ప్రతినిధులు ఆరోపించారు. కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ వారు తొలుత అలహాబాద్ హైకోర్ట్ను ఆశ్రయించారు.
దీనిపై సమగ్ర విచారణ నిర్వహించిన అలహాబాద్ హైకోర్టు.. సూపర్టెక్ యాజమాన్యాన్ని తప్పు పట్టింది. ప్రతికూలంగా ఆదేశాలను జారీ చేసింది. ట్విన్ టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సూపర్ టెక్ యాజమాన్యం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఏడేళ్లపాటు విచారణ నిర్వహించిన అనంతరం సుప్రీంకోర్టు కూడా సూపర్టెక్కు వ్యతిరేకంగా తన తీర్పును వెలువడించింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.