సుబ్రతారాయ్కు షాక్: జైలు బయటే ఉండాలంటే రూ.62వేల కోట్లు చెల్లించాలి
న్యూఢిల్లీ: సహారా ఇండియా పరివార్ గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ రూ.626 బిలియన్లు (రూ.62,600 కోట్లు) చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని భారత మార్కెట్ రెగ్యులేటర్ సెబి(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆయన డబ్బు జమ చేయాలని లేదంటే పెరోల్ను రద్దు చేయాలని కోరింది. గతంలో 2012, 2015లో ఇచ్చిన తీర్పులను సహారా గ్రూప్ పాటించలేదని సెబి తన పిటిషన్లో తెలిపింది. రోజు రోజుకు రుణాలు పెరుగుతున్నప్పటికీ కోర్టు ఆదేశాలను ఏమాత్రం పాటించడం లేదని, ధిక్కరిస్తున్నారని తెలిపింది.
భారత్ ఎకానమీ అదుర్స్.. కరోనా నుండి కోలుకుంటోంది: ఏ రేటింగ్ ఏజెన్సీ ఎంత అంచనా?
8 ఏళ్లలో భారీగా పెరిగిన సంపద
సహారా ఇండియా పరివార్ గ్రూప్లోని రెండు కంపెనీలు, అధినేత సుబ్రతారాయ్ వడ్డీతో కలిపి రూ.62,600 కోట్లు చెల్లించాలని కోర్టుకు సెబి తెలిపింది. ఎనిమిదేళ్ళ క్రితం రూ.25,700 కోట్లు చెల్లించాల్సి ఉండగా, నాటి ఆదేశాలు బేఖాతరు చేయడంతో ఇప్పుడు అది రూ.62,600 కోట్లకు పెరిగిందన్నారు. సహారా గ్రూప్ తక్షణమే తమ బకాయిలు మొత్తం చెల్లించేలా ఆదేశించాలని లేదా పెరోల్ను రద్దు చేసి జైలుకు పంపించాలని సుప్రీం కోర్టును కోరింది.
రూ.25వేల కోట్లు చెల్లించలేదు.. ఇప్పుడు రూ.62వేల కోట్లు..
సెబికి అవసరమైన అనుమతి పత్రాలు ఇవ్వకుండానే సహారా ఇండియా పరివార్ గ్రూప్లోని సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పోరేషన్ లిమిటెడ్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ 3 కోట్ల మందికి పైగా ఇన్వెస్టర్ల నుండి రూ.19,400 కోట్లకు పైగా, రూ.6,380 కోట్లకు పైగా సేకరించాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా సేకరించడంతో కోర్టుకు చేరుకుంది.
సేకరించిన మొత్తాన్ని వడ్డీతో కలిపి ఇన్వెస్టర్లకు చెల్లించాలని ఎనిమిదేళ్ల క్రితం సహారాను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎనిమిదేళ్ల క్రితం అది రూ.25వేల కోట్లు కాగా, ఇప్పుడు రూ.62,600 కోట్లు. సహారా గ్రూప్ వీటిని చెల్లించకపోవడంతో సుబ్రతా రాయ్ జైలుకు వెళ్లాడు. సుబ్రతారాయ్ రెండేళ్ల పాటు జైల్లో ఉన్నాడు. 2016లో విడుదలయ్యాడు. రాయ్తో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లు జైలుకు వెళ్లి వచ్చారు.
సహారా గ్రూప్ ఏమన్నదంటే
2020 ఫిబ్రవరి నాటికి సహారా గ్రూప్ రూ.15,448 కోట్లు జమ చేసింది. ఆ తర్వాత చెల్లింపులు చేయకపోవడంతో కోర్టుకు వెళ్లింది. అయితే సహారా మాత్రం సెబి ఆరోపణలను ఖండించింది. సెబి డిమాండ్ సరికాదని, ఉద్దేశ్యపూర్వకంగా 15 శాతం వడ్డీని కలిపిందని, ఇన్వెస్టర్లకు సంస్థ తిరిగి ఇచ్చేసిందని వెల్లడించింది. సుబ్రతా రాయ్ ఫార్ములా వన్ టీమ్, ఎయిర్ లైన్స్, క్రికెట్ టీమ్, లండన్లో ఖరీదైన హోటల్స్ కలిగి ఉన్నారు.