2జీ సేవలు ఆపండి, 30 కోట్ల మంది వద్ద ఫీచర్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలకు దూరం: ముఖేశ్ అంబానీ..
దేశంలో 2జీకి సేవలు నిలిపివేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేశ్ అంబానీ. ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తోందని గుర్తుచేశారు. కానీ దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫీచర్ ఫోన్ వాడుతున్నారని తెలిపారు. దీంతో వారు ఇంటర్నెట్ సేవలకు దూరంగా ఉంటున్నారని వెల్లడించారు. దేశంలో 2జీ సేవల నిలిపివేత కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
దేశంలో 1995 ఏడాదిలో మొబైల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో పురోగతి సాధించామని ముఖేశ్ అంబానీ తెలిపారు. ఆ సమయంలో కాల్ చేస్తే నిమిషానికి రూ.16 చెల్లించాల్సి వచ్చేదని.. కాల్ రిసీవ్ చేసుకుంటే నిమిషానికి రూ.8 చెల్లించాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు 4జీ కాల్స్ ఉచితంగా చేసుకుంటున్నారని చెప్పారు.
అంతేకాదు మొబైల్లో వార్తలు చదువుకోవచ్చని, వీడియోలు చూడటం, వస్తువుల కొనుగోళ్లు చేయడం వంటి సేవలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. సెల్ ఫోన్ల ద్వారా విద్యార్థులు ఇంటి నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారని గుర్తుచేశారు. సమావేశాలు కూడా ఫోన్ల ఆధారంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.