లండన్లో రూ.592 కోట్లతో హెరిటేజ్ ప్రాపర్టీని కొన్నది ఇంటికోసం కాదు కానీ..: రిలయన్స్ క్లారిటీ
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ.. త్వరలో భారత్ను వీడనున్నట్లు వార్తలొచ్చాయి. ఇక ఆయన లండన్కు మకాం మార్చబోతోన్నారని, కుటుంబంతో సహా అక్కడికి శాశ్వతంగా తరలి వెళ్లిపోనున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. దీనికోసం 592 కోట్ల రూపాయలతో స్టోక్ పార్క్ ప్రాపర్టీని కొనుగోలు చేసిందంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక త్వరలోనే ఆయన తన ఆంటాలియాను వీడనున్నట్లు అంచనా వేశాయి.
జేమ్స్బాండ్ మూవీస్లల్లో..
స్టోక్ పార్క్.. బకింగ్హామ్షైర్లో ఉంటుందీ స్థిరాస్తి. 14 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. చుట్టూ పచ్చదనం, మధ్యలో రాజ ప్రాసాదాన్ని తలపించే భారీ భవనం పేరే స్టోక్ పార్క్. బ్రిటన్ ప్రభుత్వం దీన్ని వారసత్వ సంపదగా గుర్తించింది. దీన్ని లీజుకు ఇచ్చింది. ప్రస్తుతం దీని నిర్వహణ మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. సినిమా షూటింగ్లకు అనువుగా ఉండే భారీ భవనం ఇది. జేమ్స్బాండ్ సిరీస్లో వచ్చిన గోల్డ్ఫింగర్, టుమారో నెవర్ డైస్, బ్రిడ్జెట్ జోన్స్ డైరీ, లేయర్ కేక్ వంటి భారీ బడ్జెట్ సినిమాల చిత్రీకరణలో ఈ స్టోక్ పార్క్ బిల్డింగ్లో సాగింది.
592 కోట్లతో..
49 అత్యంత విలాసవంతమైన బెడ్రూమ్స్ అండ్ బిజినెస్ సూట్స్, గోల్ఫ్ కోర్స్, 13 టెన్నిస్ కోర్టులు, 14 ఎకరాల్లో ప్రైవేట్ గార్డెన్.. స్టోక్ పార్క్ పరిధిలో ఉన్నాయి. తాజాగా ఈ స్టోక్ పార్క్ను ముఖేష్ అంబానీ కొనుగోలు చేశారు. 592 కోట్ల రూపాయలను దీని కోసం ఖర్చు చేశారు. దీనితో- సహజంగానే ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు ఇక బకింగ్హామ్షైర్కు తరలి వెళ్తారనే ప్రచారం సాగింది. దీనికి ముహూర్తం కూడా ఖాయమైందని వార్తలు వెలువడ్డాయి.
నిజమే గానీ..
దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వివరణ ఇచ్చింది. ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తమ సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ.. భారత్ను వీడి వెళ్లట్లేదని స్పష్టం చేసింది. స్టోక్ పార్క్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన సమాచారం నిజమేనని.. దాన్ని నివాసంగా మార్చుకోవట్లేదని పేర్కొంది. ఆ ప్రాపర్టీని ప్రీమియర్ గోల్ఫ్ క్లబ్గా, స్పోర్టింగ్ రిసార్ట్గా మార్చబోతోన్నట్లు తెలిపింది రిలయన్స్ ఇండస్ట్రీస్.
భారత్ను వీడే ఆలోచనే లేదు..
రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్ లిమిటెడ్ పేరు మీద దాన్ని కొనుగోలు చేశామని, టాప్ హాస్పిటాలిటీగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొంది. లండన్ మాత్రమే కాదు.. ప్రపంచంలో మరెక్కడే గానీ స్థిరపడాలని ముఖేష్ అంబానీ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ భావించట్లేదని, ఆ దిశగా కనీసం ఆలోచన గానీ చేయట్లేదని స్పష్టం చేసింది. లండన్కు తరలి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను రిలయన్స్ ఇండస్ట్రీస్ తోసిపుచ్చింది.