దేశీయ అవసరాలకు కావాల్సిన వంటనూనె నిల్వలు ఉన్నాయి: అందుకే ధరల పెరుగుదల
వంటనూనెల కొరత లేదని, దేశీయ అవసరాలకు సరిపడా స్థాయిలో నిల్వలు ఉన్నాయని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ధరలు, సరఫరాను ఎప్పటికి అప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. దేశంలో ప్రస్తుతం దాదాపు 21 లక్షల టన్నుల వంట నూనెల నిల్వలు ఉన్నట్లు తెలిపారు. మరో 12 లక్షల టన్నుల నూనెలు ఈ నెలలో దిగుమతి అవుతున్నాయని, ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
నూనె గింజల ఉత్పత్తి విషయానికి వస్తే వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2022 ఫిబ్రవరిలో విడుదల చేసిన రెండో ముందస్తు అంచనాల ప్రకారం సోయాబీన్ ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరంలో 126.10 లక్షల టన్నులు ఉండగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 112 లక్షల టన్నులుగా ఉంది. ఆవగింజల నూనెలు అయితే రాజస్థాన్లో గత ఏడాది 114 లక్షల టన్నులు కాగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 37 శాతం అధికం.
వంట నూనెల ధరలు, లభ్యత పరిస్థితులను సమీక్షిస్తున్న ఆహార, ప్రజా పంపిణీ విభాగం క్రమం తప్పకుండా వంట నూనెల ప్రాసెసింగ్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహిస్తోంది. దేశీయంగా వంట నూనెల ధరలు అదుపులో ఉండేలా చర్చలు జరుపుతోందని, దీంతో రిటైల్ వినియోగదారులకు ఊరట కల్పించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి బాగా తగ్గడంతో ఎగుమతి దేశాలు విధిస్తున్న పన్నులు పెరగడంతో వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి.