Steel Man of India: కన్నుమూసిన స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. సంతాపం తెలిపిన టాటా స్టీల్
Steel Man of India: టాటా గ్రూప్ కు చెందిన స్టీల్ తో నాలుగు దశాబ్దాల అనుబంధం కలిగిన స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా జంషెడ్ జె ఇరానీ కన్నుమూశారు. ఆయన 85 ఏళ్ల వయస్సులో సోమవారం అర్థరాత్రి మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జంషెడ్పూర్లోని టాటా మెయిన్ ఆసుపత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టాటా స్టీల్ యాజమాన్యం సైతం ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలిపింది.
|
సంతాపం తెలిపిన కేంద్ర మంత్రి..
టాటా స్టీల్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావటంలో కీలక పాత్ర పోషించిన ఇరానీ మృతి పట్ల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంతాపం తెలిపారు. ఇరానీ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని వ్యక్తం చేశారు.
|
అసలు ఎవరు ఈ ఇరానీ..?
ఇరానీకి టాటా స్టీల్తో నాలుగు దశాబ్దాలకు పైగా విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన 1963లో UK షెఫీల్డ్లోని బ్రిటిష్ ఐరన్ అండ్ స్టీల్ రీసెర్చ్ అసోసియేషన్తో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1968లో భారత్ కు తిరిగి వచ్చాక.. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో(Tata Steel) రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్కి అసిస్టెంట్గా చేరారు.
|
అంచెలంచెలుగా ఎదిగి..
కంపెనీలో అంచెలంచెలుగా ఎదిగిన ఇరానీ.. 1978లో టాటా స్టీల్ జనరల్ సూపరింటెండెంట్గా, 1979లో జనరల్ మేనేజర్గా, 1985లో ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. ఆ కాలంలోనే 1981లో టాటా స్టీల్ బోర్డ్లో చేరారు. చివరికి 2011 జూన్ లో పదవీ విరమణ చేసి, 43 ఏళ్ల వారసత్వాన్ని విడిచిపెట్టారు. అలా ఆయన టాటా గ్రూప్ లోని అనేక ఇతర కంపెనీల్లోనూ కీలక బాధ్యతలు పోషించారు.
పద్మభూషణ్..
2007లో పద్మభూషణ్, 2008లో భారత ప్రభుత్వం నుంచి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు. 1990లలో భారత ప్రభుత్వం ఆర్థిక సరళీకరణను తీసుకొచ్చినప్పుడు టాటా స్టీల్ కంపెనీకి నాయకత్వం వహించారు. దేశీయ ఉక్కు పరిశ్రమ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన దూరదృష్టి కారణంగా నేడు భారత్ స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగాముల్లో ఒకటిగా నిలిచింది.