SBI Q4 Results: ఎస్బీఐ ఇన్వెస్టర్స్ ఫుల్ హ్యాపీ.. బంపర్ లాభాలతో సూపర్ డివిడెండ్..
SBI Q4 Results: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో బ్యాంక్ నికర లాభం ఏకంగా 83 శాతం మేర పెరిగి రికార్డుల మోత మోగించింది.
జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో బ్యాంక్ నికర లాభం రూ.16,694.51 కోట్లుగా నమోదైంది. ఇదే కాలంలో నికర వడ్డీ ఆదాయం రూ.40,392.50 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది కాలంలో రూ.31,197 కోట్లతో పోలిస్తే దాదాపు 29.5 శాతం అధికం కావటం విశేషం. ఆర్థిక ఫలితాలు ఊహించినదాని కంటే మెరుగ్గా నమోదు కావటంతో బ్యాంక్ బోర్డు ఒక్కో షేరుపై ఇన్వెస్టర్లకు రూ.11.30 డివిడెండ్ చెల్లించాలని సిఫార్సు చేసింది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం ఇది జూన్ 14, 2023న చెల్లించబడనుంది.
మెుత్తం ఆర్థి సంవత్సరం ఫలితాలను గమనిస్తే బ్యాంక్ నికర లాభం 59 శాతం పెరిగి రూ.50,232.45 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆస్తుల నాణ్యత సైతం మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తులు(GNPA) అక్టోబర్-డిసెంబర్ 2022 అంతకు ముందు త్రైమాసికంలో రూ.98.347 కోట్ల నుంచి 7.5 శాతం క్షీణించి రూ.90,927.8 కోట్లకు పడిపోయింది. జనవరి-మార్చి 2023లో బ్యాంక్ స్థూల NPA నిష్పత్తి 2.78 శాతానికి పడిపోయింది.
2021-22 జనవరి-మార్చి కాలంలో రూ.7,237.45 కోట్ల నుంచి మొండి బకాయిలు, ఆకస్మిక కేటాయింపులు ఈ త్రైమాసికంలో దాదాపు సగానికి తగ్గి రూ.3,315.71 కోట్లకు చేరుకున్నాయి. Q4FY23 కోసం దేశీయ నికర వడ్డీ మార్జిన్ (NIM) 44 బేసిస్ పాయింట్లు ఏడాది ప్రాతిపధికన పెరిగి 3.84 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో స్టాక్ ధర రూ.574.80 వద్ద ట్రేడవుతోంది.