Sputnik V: భారత్లో ఉత్పత్తికి ముహూర్తం ఫిక్స్: విదేశాలకు 70 శాతం ఎగుమతి
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ల కొరతను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని అధిగమించేలా భారత్ కీలక నిర్ణయాలను తీసుకుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్ను దేశంలో ఉత్పత్తి చేయడానికి అవసరమైన అనుమతులను త్వరలోనే జారీ చేయబోతోంది. వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఫార్ములాను దిగుమతి చేసుకోనుంది. వచ్చే ఆగస్టు నుంచి భారత్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీ ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
హీరో బైక్స్ ప్రియులకు గుడ్న్యూస్: ఆ యూనిట్లన్నీ రీస్టార్ట్
రష్యాలోని భారత రాయబారి డీ బాల వెంకటేష్ వర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. సెయింట్ పీటర్స్బర్గ్లో స్థానిక మీడియా ప్రతినిధులకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. వ్యాక్సిన్కు సంబంధించిన పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ప్రపంచం మొత్తం మీద సరఫరా అయ్యే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లో 65 నుంచి 70 శాతం వరకు భారత్లోనే తయారవుతుందని అన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి రష్యా ప్రభుత్వం ఇప్పటికే 2,10,000 డోసుల వ్యాక్సిన్ను రెండుదశల్లో భారత్కు పంపించిందని గుర్తు చేశారు. మరో మూడు మిలియన్ల డోసుల వ్యాక్సిన్ త్వరలోనే భారత్కు అందుతుందని అన్నారు.
జూన్ చివరి వారం నాటికి అయిదు లక్షల డోసులను భారత్కు పంపించాలని రష్యా ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇక ఆగస్టు నుంచి భారత్లోనే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తి ఆరంభమౌతుందని అన్నారు. స్పుత్నిక్ లైట్ (Sputnik Light) వ్యాక్సిన్ వినియోగానికి కూడా భారత ప్రభుత్వం త్వరలోనే అనుమతులు ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అందాయని పేర్కొన్నారు. భారత్లో ఈ వ్యాక్సిన్ను హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తయారు చేస్తోన్న విషయం తెలిసిందే. దీని ధరను రూ.995.40 పైసలుగా నిర్ధారించింది.