ఒమిక్రాన్ దెబ్బతో వృద్ధి రేటు తగ్గుతుంది.. కానీ: వడ్డీ రేటు స్థిరంగా...
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పునరుద్ధరణపై ప్రభావం ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. ఒమిక్రాన్ ప్రభావం 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని రేటింగ్ ఏజెన్సీ విశ్వసిస్తోంది. ఇండియా రేటింగ్స్ అంచనా ప్రకారం 4QFY22లో జీడీపీ వృద్ధి రేటు ఏడాది ప్రాతిపదికన 5.7 శాతంగా నమోదవుతుందని, క్రితం అంచనాలతో పోలిస్తే ఇది 40 బేసిస్ పాయింట్లు తక్కువ అని వెల్లడించింది. అంతకుముందు నాలుగో త్రైమాసికం వృద్ధి రేటును 6.1 శాతంగా అంచనా వేసింది. ఇప్పుడు దీనిని తగ్గించింది.
ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం
2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు ఏడాది ప్రాతిపదికన 9.3 శాతంగా నమోదయింది. అంతకుముందు వేసిన 9.4 శాతం అంచనా కంటే ఇది 10 బేసిస్ పాయింట్లు తక్కువ. ఒమిక్రాన్ కారణంగా పలు ప్రాంతాల్లో నైట్/వారాంతపు కర్ఫ్యూలు, మార్కెట్/మార్కెట్ కాంప్లెక్స్ సామర్థ్యం తగ్గింపు వంటి వివిధ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయా రాష్ట్రాలు ఒమిక్రాన్ వ్యాప్తిని నిరోధించేందుకు అనేక చర్యలు చేపట్టడం ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతోంది.
ఇన్ఫెక్షన్ తక్కువ
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు గతంలోని కోవిడ్ వేరియంట్స్ కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయని, కాబట్టి ఎక్కువ ప్రాణాపాయం లేదని సూచిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పాలకులు ఒమిక్రాన్ పైన అధిక నియంత్రణలు విధిస్తున్న నేపథ్యంలో కరోనా 1.0, 2.0 కంటే తక్కువ అంతరాయం ఉంటోందని తెలిపింది. అదే సమయంలో కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం దీనికి సన్నద్ధమయ్యారని తెలిపింది. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆర్థిక వ్యవస్థపై కరోనా 3.0 ప్రభావం కరోనా 1.0, 2.0 కంటే తక్కువగా ఉంటుందని, ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా పుంజుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది.
వడ్డీ రేటు స్థిరంగా
అయితే ఆర్థిక రికవరీ వేగవంతం కావడానికి పాలసీ మద్దతు అవసరమని కూడా రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయపడింది. మహమ్మారి ముప్పు కొనసాగే వరకు, ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి పథకానికి చేరుకునే వరకు విధాన మద్దతు అవసరమని, ఇందుకు ద్రవ్య మద్దతు, ఆర్థిక మద్దతు.. రెండూ కీలకమని తెలిపారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ వంటి ప్రీక్వెన్సీ సూచీలు కరోనా ముందుస్థాయి కంటే తక్కువ స్థాయిలోనే ఉంది.
ఆర్బీఐ మరింత కాలం పాలసీ రేటులో తన అనుకూల వైఖరిని కొనసాగిస్తుందని, ప్రస్తుత పరిస్థితుల్లో మార్చకపోవచ్చునని పేర్కొంది.