Income Tax Rate: నయా టాక్స్ సిస్టమ్ వచ్చేస్తోందా..? ఇకపై పన్ను మినహాయింపులు, రాయితీలు ఉండవ్.. ఎందుకంటే..
Income Tax Rate: మినహాయింపులు లేదా రాయితీలు లేకుండా టాక్స్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. కొత్త విధానంలో పన్నును తగ్గించడం వల్ల మరింత ఆకర్షణీయంగా మారుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.సెప్టెంబర్ 2019లో కార్పొరేట్ పన్ను చెల్లింపుదారుల కోసం ఇదే విధమైన పన్ను విధానాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో పన్ను రేటు తగ్గించటం జరిగింది. అదే సమయంలో అప్పటి వరకు అందిస్తున్న మినహాయింపులు లేదా రాయితీలు రద్దు చేయబడ్డాయి.
రాయితీలు లేని టాక్స్ విధానం..
ఎలాంటి రాయితీలు లేని పన్ను వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనితో పాటు మినహాయింపులు, తగ్గింపులతో కూడిన సంక్లిష్టమైన(Complex) పాత పన్ను విధానాన్ని ప్రభుత్వం తొలగించాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా 2020-21 సాధారణ బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం ఎంపిక నిర్ణయం..
అయితే ప్రస్తుతం పాత పద్ధతి, కొత్త టాక్స్ విధానం ప్రస్తుతం దేశంలో అమలులో ఉంది. ఆదాయపన్ను శాఖ దీనికి సంబంధించి కొన్ని నిబంధనలతో ఎంపికను అందుబాటులో ఉంచింది. అయితే కొత్త టాక్స్ విధానాన్ని చాలా మంది ప్రజలు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. హోమ్, ఎడ్యుకేషన్ లోన్స్ చెల్లించిన వారు కొత్త విధానంలోకి మారేందుకు సుముఖంగా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పన్నుల వ్యవస్థను సులభతరం చేసేందుకు..
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు Tax విధానాన్ని సులభతరం చేయడానికే 2020-21లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా పన్ను మినహాయింపులకోసమని అనవసరమైన పెట్టుబడులు పెట్టకుండా వీలు కల్పిస్తోంది. దీని వల్ల టాక్స్ చెల్లింపుదారులు తన సౌలభ్యానికి అనుగుణంగా ఇన్వెస్ట్ మెంట్లను ఎంచుకునేందుకు అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.
ప్రస్తుత విధానం ప్రకారం..
వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారుల కోసం ఫిబ్రవరి 1, 2020న ప్రకటించిన శ్లాబ్ రేటు ప్రకారం రూ.2.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయంపై ఐదు శాతం పన్ను ఉంటుంది. అదే విధంగా.. రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం, రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం, రూ.12.5 నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయంపై 25 శాతం, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం కంటే ఎక్కువ టాక్స్ విధించబడుతుంది.