6 రెట్లు పెరిగిన వేతన సంబంధ ఖర్చు, ఉద్యోగులకు ఓయో షాక్, 2,000 ఉద్యోగాల కోత!
సాఫ్టుబ్యాంకుకు చెందిన ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ వచ్చే నెల (జనవరి 2020) చివరలో తమ ఉద్యోగుల్లోని కొంతమందికి షాకివ్వనుందని తెలుస్తోంది. భారత్లో దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించనుందట. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ హాస్పిటాలిటీ స్టార్టప్ తమ ఉద్యోగుల పర్ఫార్మెన్స్ను ప్రతి నెల సమీక్షిస్తుంది. పర్ఫార్మెన్స్ ఆధారంగా కొంతమంది ఫర్ఫార్మెన్స్ ఇంప్రూమెంట్ ప్రోగ్రామ్ అనంతరం కొంతమందిని తొలగించవచ్చు.
'ఇది మహా మాంద్యం దిశగా, ఆదాయపన్ను తగ్గిస్తే లాభం లేదు'
శిక్షణ, తొలగింపు...
ప్రతి నెల ఉద్యోగుల పనితీరును సమీక్షించే ఓయో ఫలితాలు, గ్రేడ్స్ ఆధారంగా కొంతమంది అబ్యర్థులను పనితీరు పెరుగుదలకు సంబంధించి శిక్షణా కార్యక్రమానికి పంపించడం లేదా తొలగించడం చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా అమ్మకాలు, సరఫరా, ఆపరేషన్స్ విభాగాల్లో ఉద్యోగులను తగ్గించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సమీక్ష అనంతరం ఫలితాలను ఆధారంగా అండర్ పర్ఫార్మెన్స్ ఉద్యోగులకు శిక్షణకు పంపిస్తామని ఓయో అధికార ప్రతినిధి ఒకరు చెప్పారని అంటున్నారు.
బీ గ్రేడింగ్ ఉన్నప్పటికీ ఉద్వాసన
అయితే కంపెనీ ఉద్యోగులను తొలగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. సంతృప్తికర గ్రేడ్స్ పొందిన తర్వాత కూడా కొంతమందిని పంపించవచ్చునని అంటున్నారు. సాధారణంగా D రేటింగ్ వచ్చే ఉద్యోగులపై వేటు వేసే కంపెనీ, B అంతకంటే మెరుగైన రేటింగ్ కనబరిచినా కూడా ఉద్వాసన పలకవచ్చునని తెలుస్తోంది.
రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వేతనాలు.. 6 రెట్లు పెరిగిన వేతనాలు
ఈ ఉద్యోగుల సగటు వార్షిక వేతనాలు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటాయని భావిస్తున్నారు. మార్చి 2019 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ రూ.2,384 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది కంటే ఈ నష్టం ఆరు రెట్లు కావడం గమనార్హం. ఆపరేటింగ్ ఖర్చులు పెరగడం, ఎంప్లాయీ సంబంధిత ఖర్చులు పెరగడం వల్లే ఇంత నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏడాదిలోనే ఉద్యోగుల వేతన, ఇతర సంబంధిత ఖర్చులు ఏకంగా 6 రెట్లు పెరిగాయి. ఆపరేటింగ్ ఖర్చులు 5 రెట్లు పెరిగాయి. ఉద్యోగుల వేతన ఖర్చులు రూ.1,539కు పెరిగితే, ఆపరేటింగ్ ఖర్చులు రూ.6,131కి పెరిగాయి.
2021 వరకు నష్టాల్లోనే
అయితే ఉద్యోగుల తొలగింపును ఓయో మాత్రం ఖండిస్తోంది. సమీప భవిష్యత్తులో వేలాది మంది ఉద్యోగులను తొలగించడం లేదని పేర్కొంది. ఓయో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు చొప్పించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలి రిపోర్ట్ ప్రకారం భారత్లో ఓయో 2021 వరకు నష్టాల్లోనే కొనసాగుతుందని అంచనా.