ఈశాన్యం నుంచి దేశంలోకి దొంగబంగారం: హైదరాబాద్, ముంబై టార్గెట్: స్మగ్లింగ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి గత ఏడాది విధించిన దేశవ్యాప్త లాక్డౌన్.. స్మగ్లర్లకు కొత్తదారులు వెదుక్కునేలా చేసింది. లాక్డౌన్ వల్ల విమానాశ్రయాలు, రైళ్లు.. అన్ని బంద్ కావడం వల్ల దొంగ బంగారాన్ని దేశంలోకి తీసుకుని రావడానికి కొత్త మార్గాలను వెదుక్కున్నారు. ఈశాన్య రాష్ట్రాల మీదుగా దేశంలోకి భారీగా బంగారాన్ని తరలించారు. మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాల నుంచి మయన్మార్ మీదుగా బంగారాన్ని తీసుకొచ్చినట్లు తేలింది.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2020-21 పేరుతో డీఆర్ఐ నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ మధ్యాహ్నం విడుదల చేశారు. లాక్డౌన్లో భాగంగా వైమానిక మార్గాలను మూసివేయడం వల్ల స్మగ్లర్లు దొంగ బంగారాన్ని మధ్య తూర్పు ఆసియా దేశాల నుంచి మయన్మార్ మీదుగా దేశానికి తరలించినట్లు స్పష్టం చేసిందీ వార్షిక నివేదిక.

స్మగ్లింగ్లో భాగస్వామ్యులైన వారిలో మయన్మార్ దేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారని పేర్కొంది. భారత్-మయన్మార్ 1,643 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోన్నాయి. మణిపూర్, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్తో సరిహద్దులను పంచుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబై, హైదరాబాద్ టార్గెట్గా పెద్ద ఎత్తున బంగారం స్మగ్లింగ్ చోటు చేసుకున్నట్లు ఈ నివేదికలో డీఆర్ఐ అధికారులు స్పష్టం చేశారు.

ఒక్క ఈశాన్య రాష్ట్రంలోనే 239.50 కేజీల బంగారాన్ని ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే సీజ్ చేసినట్లు తెలిపారు. గువాహటి, దిమాపూర్, కామరూప్, జలుక్బరి, టెంగ్నౌపల్ వంటి ప్రాంతాలు బంగారం స్మగ్లింగ్కు కేంద్ర బిందువులుగా మారినట్లు చెప్పారు. రోడ్డు మార్గం మీదే స్మగ్లర్లు ఆధారపడ్డారని, ఎస్యూవీ వాహనాలను పెద్ద ఎత్తున వినియోగించుకున్నారనేది స్పష్టమైందని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎప్పుడూ లేనంతగా దొంగ బంగారం పట్టుకోవడానికి లాక్డౌన్ ప్రధాన కారణమైందని చెప్పారు.


Click it and Unblock the Notifications