కరోనాతో నగరాలు విలవిల: రిలయన్స్, ఎల్జీ, శాంసంగ్... చిన్న నగరాల్లో జంప్.. ఎందుకంటే
భారత్లో కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యవస్థలు క్రమంగా కోలుకుంటున్నాయి. కొన్ని రంగాలు గత ఏడాది లేదా అంతకుముందు త్రైమాసికాల కంటే వృద్ధిని నమోదు చేశాయి. భారత్కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ కంపెనీలు ఎలక్ట్రానిక్, ఫ్యాషన్ నుండి కిరాణా సరుకుల వరకు తమ సేల్స్లో పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ప్రధానంగా తమ సంస్థల వృద్ధికి చిన్న నగరాలు కారణమని చెబుతున్నాయి. ఓ వైపు పెద్దపెద్ద నగరాలు కరోనా నుండి కోలుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే, చిన్న నగరాల్లో కార్యకలాపాలు కరోనా ముందుస్థాయి కంటే వృద్ధిని నమోదు చేస్తున్నాయని చెబుతున్నాయి.
వర్క్ ఫ్రమ్ హోం.. చిన్న పట్ఠణాల్లో వినియోగం జంప్
దేశంలోని అతిపెద్ద రిటైలర్ రిలయన్స్ రిటైల్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో తన ఫ్యాషన్ రంగం సేల్స్లో భారీ వృద్ధిని నమోదు చేశాయి. గత ఏఢాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు దాదాపు రెట్టింపుగా ఉన్నట్లు తెలిపింది. అక్టోబర్-డిసెంబర్ కాలంలో సేల్స్ కరోనా ముందుస్థాయికి చేరుకుంటాయని చెబుతున్నాయి.
శాంసంగ్, ఎల్జీ ఆదాయం సగం చిన్న పట్టణాల నుండి
భారత అతిపెద్ద పరికరాల తయారీ సంస్థ ఎల్జీ ఆదాయంలో సగం టైర్ 2, టైర్ 3 నగరాల నుండి వస్తున్నట్లు తెలిపింది. ఎల్జీ ఇండియా ఉపాధ్యక్షులు విజయ్ బాబు మాట్లాడుతూ వర్క్ ఫ్రమ్ హోం నేపథ్యంలో చాలామంది వైట్ కాలర్ ఉద్యోగులు ఇంటి వద్ద నుండి పని చేస్తున్నారని, చిన్న పట్టణాల్లో అందుకే వినియోగం పెరిగిందన్నారు.
శాంసంగ్ ఉత్పత్తులు కూడా పెద్ద నగరాల కంటే చిన్న నగరాల్లో సేల్స్ పెరిగాయి. శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్) రాజన్ మాట్లాడుతూ.. ప్రీమియంతో సహా అన్ని ఉత్పత్తుల సేల్స్ నగరాల కంటే చిన్న పట్టణాల్లో ఎక్కువగా ఉందని, అక్టోబర్ నెలలో మొత్తం సేల్స్ 32 శాతం పెరగగా, ప్రీమియం ఉత్పత్తులు 52 శాతం పెరిగాయని తెలిపారు. చిన్న మార్కెట్లో టెలివిజన్ ప్రీమియం వంటి ఉత్పత్తులు కూడా 72 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
అందుకే తగ్గాయి..
వర్క్ ఫ్రమ్ హోం, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు, నగరాల్లో కరోనా తీవ్రత వంటి వివిధ కారణాల వల్ల ఉద్యోగులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంటి వద్ద నుండే పని చేస్తున్నారు. గ్రామాలకు, టైర్ 2, టైర్ 3 నగరాలకు వెళ్లిపోవడంతో అక్కడ సేల్స్ పెరిగాయి. చిన్న పట్టణాల్లో సేల్స్ పెరిగి, నగరాల్లో క్షీణించాయి. మొత్తానికి చిన్న పట్టణాలు కరోనా తీవ్రత తగ్గి సాధారణ స్థితికి వస్తుండగా, నగరాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.